గోపాల్‌పూర్‌‌లో దొంగల బీభత్సం .. గంటసేపట్లో నాలుగు ఇండ్లు లూటీ

గోపాల్‌పూర్‌‌లో దొంగల బీభత్సం .. గంటసేపట్లో  నాలుగు ఇండ్లు లూటీ

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ పరిధి గోపాలపూర్ ​భద్రకాళి నగర్​ రోడ్డు నెం.1లో మంగళవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.   భద్రకాళినగర్‌‌కు చెందిన పాటి స్రవంతి ఐనవోలు కేజీబీవీలో పని చేస్తుండగా.. ఆమె భర్త ఖమ్మంలో డిగ్రీ కాలేజీ లెక్చరర్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ధర్మయ్య డ్యూటీకి వెళ్లిన అనంతరం అక్కడి నుంచి వారి బంధువుల పెళ్లికి వెళ్లాడు.  స్రవంతి కేజీబీవీ హాస్టల్‌లో  రాత్రి విధులు నిర్వర్తించి బుధవారం ఉదయం ఇంటికి చేరింది. 

అప్పటికే ఇంటి తాళం పగులగొట్టి ఉండటం చూసి షాక్​ అయ్యింది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. దాదాపు రూ.10 లక్షల విలువైన 20 తులాల బంగారం, 7 తులాల వెండి, రూ.57 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది. ఈ మేరకు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ రవి కుమార్, ఎస్సైలు శ్రీకాంత్​, మాధవ్​, రవికుమార్​ రంగంలోకి దిగి  సీసీ  కెమెరాలను పరిశీలించారు.  కాగా స్రవంతి, ధర్మయ్య ఇంట్లో చోరీ పాల్పడింది ఒక వ్యక్తేనని సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

తాపీగా నడుచుకుంటూ వచ్చి..

ధర్మయ్య ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తి.. ఆ ఎదురుగా ఉన్న మరో ఇంట్లో  దొంగతనం చేశాడు.  ఆ ఇంటి యజమాని ఇటీవలే ఇంటికి తాళం వేసి అమెరికాలో ఉంటున్న తన కొడుకుల వద్దకు వెళ్లగా.. ఆ తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇదంతా సీసీ ఫుటేజీలో రికార్డ్​ అవగా.. ఆ ఇంట్లో  ఎంత ప్రాపర్టీ చోరీకి గురైందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.  

చోరీకి పాల్పడిన దుండగుడు మొదట ఇదే కాలనీలోని ఓ ఇంట్లో చొరబడగా.. అక్కడ ఏమీ లభించకపోవడంతో తాపీగా నడుచుకుంటూ వచ్చి ఈ రెండిండ్లను కొల్లగొట్టినట్లు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. భద్రకాళి నగర్ లో మొత్తంగా మూడు ఇండ్లు కొల్లగొట్టిన అనంతరం దుండగుడు పక్కనే ఉన్న కృష్ణకాలనీలోని ఇంట్లో కూడా చోరీకి పాల్పడినట్లు తెలిసింది.