‘ఇవే నా చివరి ఎన్నికలు..’ బీహార్‌ సీఎం కీలక వ్యాఖ్యలు

‘ఇవే నా చివరి ఎన్నికలు..’ బీహార్‌ సీఎం కీలక వ్యాఖ్యలు

బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలని గురువారం పూర్ణియా జిల్లాలో జ‌రిగిన‌ ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలే తాను పోటీ చేసే చివరి ఎన్నికలని తెలిపారు. ‘దయచేసి తెలుసుకోండి. ప్రచారానికి ఇవాళే చివరి రోజు. ఎల్లుండి ఓటింగ్‌. ఇదే నా చివరి ఎన్నిక. అంతిమ్ భలాతో సబ్ భాలా (అంతిమ విజయం బాగుంటే అంతా బాగుటుంది) ’ అని ఎన్నికల సభలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి సీఎం నితీశ్‌ కుమార్‌ అన్నారు.

నితీశ్‌కుమార్‌ చేసిన ఈ ప్రకటనతో జేడీయూ నేతల్లో కలవరం రేగింది. మరో 24 గంటల్లో బీహార్‌లో మూడో దశ ఎన్నికలు జరగనున్న తరుణంలో నితీష్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల తుది దశ పోలింగ్‌ ప్రచారం ముగిసే చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ గత 35 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అసెంబ్లీకి పోటీ చేయలేదు. 1977లో తొలిసారి తన సొంత జిల్లా నలందాలోని హర్నౌత్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు