- 3 కమిషనరేట్లు.. 25వేల మంది పోలీసులు
- గణనాథుల శోభాయాత్రకు ఫుల్
- సెక్యూరిటీ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
- కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిఘా
- పోకిరీలపై షీ టీమ్స్ ఫోకస్
హైదరాబాద్,వెలుగు: గణనాథుల నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆదివారం జరగనున్న శోభాయాత్ర కోసం గ్రేటర్లోని 3 కమిషనరేట్ల పరిధిలో 25 వేల మంది పోలీసులతో హుస్సేన్సాగర్, సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్, సఫీల్ గూడ చెరువులతో పాటు నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో భద్రతను పెంచారు. శుక్రవారం హుస్సేన్ సాగర్ వద్ద సిటీ సీపీ అంజనీకుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. బాలాపూర్ గణపతి మండపం నుంచి చార్మినార్, మొజంజాహీ మార్కెట్ మీదుగా హుస్సేన్ సాగర్ వరకు రూట్ మ్యాప్ను చెక్ చేశారు. శోభాయాత్ర సాగే రూట్తో పాటు హుస్సేన్ సాగర్ చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. సీసీ కెమెరాలను పోలీస్ కాప్ యాప్కి కనెక్ట్ చేశారు. గూగుల్ మ్యాప్తో శోభాయాత్ర, ట్రాఫిక్ అప్డేట్స్ను అందించనున్నారు. ట్యాంక్బండ్, ఎన్టీఆర్మార్గ్లో షీ టీమ్స్ పోలీసులతో నిఘా పెట్టారు.
ట్యాంక్ బండ్ కు 565 స్పెషల్ బస్సులు
ట్యాంక్ బండ్ పై జరిగే గణనాథుల నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చే సిటిజన్ల కోసం గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సిటీలోని అన్ని పాయింట్ల నుంచి ట్యాంక్ బండ్కు చేరుకునేలా 565 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లుగా ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. అర్ధరాత్రి వరకు రాకపోకలకు వీలుగా ట్రాన్స్ పోర్టు ఫెసిలిటీ కల్పిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పోలీస్ అధికారులతో కలిసి కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తామన్నారు. బస్సులు బ్రేక్ డౌన్, ఇతర రిపేర్లు వస్తే వెంటనే బాగుచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.