- మెదక్ జిల్లా ఎల్లాపూర్ లోని మంజీరాకు వెళ్లిన ఆరుగురు
- రక్షించిన ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు
పాపన్నపేట, వెలుగు: చేపల వేటకు వెళ్లిన ఆరుగురు గురువారం మంజీరా నది వరద ప్రవాహంలో చిక్కుకుపోగా ఫైర్ మెన్లు రెస్య్కూ ఆపరేషన్ చేసి వారిని రక్షించారు. మెదక్జిల్లా హవేలి ఘనపూర్ మండలం చౌట్లపల్లికి చెందిన బండమీది సిద్దిరాములు, బింగిరి పోచయ్య, ఔరంగాబాద్ కు చెందిన నాగరాజు, మెదక్ టౌన్కు చెందిన కృష్ణ, యాదగిరి, కట్లె సిద్ధిరాములు కలిసి మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధి ఎల్లాపూర్ వద్ద మంజీరా నదిలో చేపల వేటకు వెళ్లారు. ఎగువన సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేసిన విషయం తెలియక వారు నది మధ్యలో ఉన్నగడ్డ మీద నిలబడి చేపలు పడుతున్నారు.
ఇంతలో నదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో వారు మధ్యోలోనే చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ సైదులు, రూరల్ సీఐ విజయ్కుమార్, పాపన్నపేట మండల ఇన్చార్జి తహసీల్దార్ మహేందర్, మెదక్ స్టేషన్ఫైర్ ఆఫీసర్అమర్నాథ్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎల్లాపూర్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లయిన బోల దుర్గయ్య, నీరుడి సత్తయ్యలను కూడా అక్కడికి పిలిపించారు. ఫైర్మెన్లు శ్రీకాంత్, ప్రశాంత్, నవీన్, వెంకటేశ్వర్లు, గజ ఈతగాళ్లు కలిసి దాదాపు గంటసేపు రెస్య్కూ ఆపరేషన్నిర్వహించారు. మధ్యలో చిక్కుకున్న వారి దగ్గరకు తాడును కట్టి ఒడ్డుకు
సురక్షితంగా చేర్చారు.