హుజూరాబాద్ బరిలో వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లు!

హుజూరాబాద్ బరిలో వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లు!
  • ఒక్కో జిల్లా నుంచి 32 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు 
  • నామినేషన్లతో నిరసనలు తెలపాలని నిర్ణయం

జగిత్యాల, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసి, ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని ఫీల్డ్​అసిసెంట్లు నిర్ణయించారు. ప్రతి జిల్లా నుంచి 32 మంది చొప్పున మొత్తం 1,056 మంది బరిలో ఉండాలని తీర్మానించారు. సోమవారం అన్ని జిల్లాల్లో సమావేశమైన ఫీల్డ్​అసిసెంట్లు.. పోటీలో ఉండే అభ్యర్థులను ఖరారు చేశారు. ప్రతి జిల్లా నుంచి 25 మంది ఎస్సీ, ఎస్టీలు,  ఏడుగురు బీసీ, ఓసీల చొప్పున 32 మంది పేర్లను ఫైనల్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు పని కల్పించకుంటే ఫీల్డ్​అసిస్టెంట్ల మీద చర్యలు తీసుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర సర్కార్ 4779 జీవోను తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా 2020 మార్చిలో ఫీల్డ్​అసిస్టెంట్లు సమ్మెకు దిగారు. దాంతో స్టేట్​లో పని చేస్తున్న 7,651 మంది ఫీల్డ్​అసిస్టెంట్లను ప్రభుత్వం ఉద్యోగాల్లోంచి తొలగించింది. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఫీల్డ్​అసిస్టెంట్లు జేఏసీగా ఏర్పడి, అప్పటి నుంచి ఆందోళనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. తమ పోరాటాన్ని తీవ్రతరం చేయాలనుకుంటున్న టైమ్​లో వారికి హుజూరాబాద్ ఉప ఎన్నిక​కలిసొచ్చింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసి, సర్కారులో కదలిక తేవాలని ఈ నెల 1న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమై తీర్మానించారు. 12న హుజూరాబాద్ లో, 24న సోమాజిగూడ లో రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి స్ట్రాటజీ ఖరారు చేశారు. 

సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బుద్ధి చెప్తం.. 
హుజూరాబాద్ ఎన్నికల్లో వెయ్యి మందిమి పోటీ చేస్తం. టీఆర్ఎస్ ను ఓడగొట్టి కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తం. ఉద్యోగాల్లోంచి తొలగించడంతో ఇప్పటివరకు 48 మంది చనిపోయారు. వందలాది కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. హుజూరాబాద్ లో 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు వారి కుటుంబసభ్యులు 30 వేల మందితో వంటావార్పు చేసుకుంటూ నిరసనలు తెలుపుతం. 
- ముదుగొండ శ్యామలయ్య, తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ జేఏసీ చైర్మన్