బెంగళూరు: జీతాలు సరిగ్గా చెల్లించట్లేదని తాము పని చేస్తున్న కంపెనీనే లూటీ చేశారు ఉద్యోగులు. ఈ ఘటన శనివారం కర్నాటకలోని కోలార్లో జరిగింది. కోలార్లోని విస్ట్రన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎంప్లాయీస్కు జీతాలు బకాయి పడింది. కంపెనీ ఎంతకూ డబ్బులు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు కంపెనీలోని ఐఫోన్లను ఎత్తుకపోయారు. వీటి విలువ సుమారు రూ. 440 కోట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు సంస్థలోని ఫర్నీచర్ను, కార్లను ధ్వంసం చేశారని.. ఫోన్లను ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. కిటికీలపై ఉద్యోగులు రాళ్లు రువ్వడంతోపాటు వెహికిల్స్, ఫర్నీచర్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ను ధ్వంసం చేసిన వీడియో సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. కంపెనీలో చాలా మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారని, పలు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో దాడి చేశామని ట్రేడ్ యూనియన్ నేత పేర్కొన్నారు. విస్ట్రన్ సంస్థ యాపిల్ ఐఫోన్ 7తోపాటు లెనోవో, మైక్రోసాఫ్ట్ లాంటి పలు సంస్థలకు సంబంధించిన ఐటీ ప్రొడక్ట్లను తయారు చేస్తుంది.