కరోనాతో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి

కరోనాతో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలోని ఓ కుటుంబంలో కరోనా తీవ్ర విషాదం నింపింది. నెల రోజుల్లోనే ఓ తల్లి, కుమారుడు, కూతురు చనిపోయారు. దాదాపు 80 లక్షల  రూపాయలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదు. శంషాబాద్  మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లికి చెందిన పెదిరిపాటి విఠలయ్య-సులోచన దంపతులకు ముగ్గురు కుమారులు,  ఓ కుమార్తె. ఏప్రిల్ 28న చిన్న కుమారుడు సుభాష్ తన 25వ వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు.. వేడుకల్లో పాల్గొన్న కుటుంబ సభ్యుల్లో ఐదుగురు కరోనా బారిన పడ్డారు. మే 1న సుభాష్ తల్లి సులోచనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మే 12న ఆమె చనిపోయారు. 

అస్వస్థతకు గురైన సులోచన కుమారుడు సుభాష్, కుమార్తె లావణ్యను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 25 రోజుల తర్వాత సుభాష్ ఈ నెల 8న మరణించారు. 31 రోజులు ఆసుపత్రిలో కరోనాతో పోరాడిన లావణ్య నిన్న చనిపోయారు. ఆ ఇంట్లో కుమారుడి దశదిన కర్మ రోజే కుమార్తె అంత్యక్రియలు చేయాల్సి రావడం స్థానికులను కలిచివేసింది.

లావణ్య భర్త కిరణ్ గౌడ్ పదేళ్ల క్రితమే మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె అమ్మగారింట ఉంటున్నారు. సుభాష్ భార్య చంద్రిక ఇంటి వద్దనే కరోనాను జయించగా.. అతని కుమారుడూ కోలుకున్నాడు. కరోనా బారిన పడిన సులోచనతో పాటు సుభాష్, లావణ్యను బతికించుకోవడానికి కుటుంబ సభ్యులు నెల రోజుల పాటు కార్పొరేట్ అసుపత్రుల చుట్టూ తిరిగారు. దాదాపు 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ముగ్గురి ప్రాణాలు దక్కలేదు.  ముగ్గురి ప్రాణాలు దక్కించుకునేందుకు... శంషాబాద్ లోనే ప్రైవేట్ ఆస్పత్రితో పాటు...గచ్చిబౌలిలోని మరో కార్పొరేట్ హాస్పిటల్స్ చికిత్స తీసుకున్నారు. అయితే 80 లక్షలు ఖర్చు చేసినా... ప్రాణాలు దక్కలేదంటున్నారు కుటుంబ సభ్యులు.