జనగామలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థినుల ఆచూకీ లభ్యం

జనగామలో అదృశ్యమైన ముగ్గురు  విద్యార్థినుల ఆచూకీ లభ్యం

జనగామ జిల్లాలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థినీల ఆచూకీ లభించింది. దీంతో పోలీసులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. 

అసలేం జరిగింది..? 

జనగామ  ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినీలు మిస్సింగ్ అయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బ్యాగులను స్కూల్లోనే వదిలేసి బయటకు వెళ్లారు. ముగ్గురు విద్యార్థినీలు లేరన్న విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తించారు. వెంటనే వారి తల్లిదండ్రులకు పాఠశాల హెడ్ మాస్టర్ వలబోజు కృష్ణమూర్తి సమాచారం అందించారు. కంగారు పడిన తల్లిదండ్రులు స్కూలుకు చేరుకున్నారు. మిగతా విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అన్ని చోట్ల వెతికారు. తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి ఆరా తీశారు. చివరకు ఎక్కడా ఆచూకీ తెలియకపోవడంతో స్కూల్ హెడ్ మాస్టర్ తో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ముగ్గురు విద్యార్థినీల తల్లిదండ్రులు. 

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు మొదలుపెట్టారు. శనివారం (ఆగస్టు 5న) ఉదయం స్కూలుకు వచ్చిన తర్వాత ఎక్కడకు వెళ్లారు..? ఎలా వెళ్లారు..? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. స్కూలు దగ్గరలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. ఇదే సమయంలో ఫోన్ కాల్ రావడంతో అసలు విషయం తెలిసింది. 

ముగ్గురు విద్యార్థినీల్లో ఒక విద్యార్థి అమ్మమ్మ ఊరైన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి వెళ్లారు. సిద్దిపేటలోని కోమటి చెరువు చూసేందుకు వెళ్లామని చెప్పారు విద్యార్థినీలు. ముగ్గురి ఆచూకీ లభించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.