
మూడింటిలోనే మోత..
ఎడారి హీట్లో.. అరేబియన్ నైట్స్లో.. ఇసుక తిన్నెల మధ్య.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చగా పరుచుకున్న అందమైన మూడు స్టేడియాలు.. ఐపీఎల్ కోసం రెడీ అయ్యాయి..! అలుపుసొలుపు లేకుండా బాదినోడికి.. అందినంత పరుగుల దాహం తీర్చేందుకు సిద్ధమయ్యాయి..! గతంలోలాగా కాకుండా .. ఈసారి బ్యాట్కు, బాల్కు మధ్య బ్యాలెన్స్ ఉండేలా రూపొందించిన పిచ్లపై హీరో ఎవరో.. జీరో ఎవరో తేలాలంటే ధనాధన్ ఆటను కనులారా వీక్షించాల్సిందే..! సో.. మిగిలింది యాక్షనే కాబట్టి.. వెల్కమ్ టు దుబాయ్, అబుదాబి, షార్జా.. ఈ స్టేడియాలను మీ ముందుకు తెస్తున్నాం..!!
వెలుగు స్పోర్ట్స్ డెస్క్: కరోనా దెబ్బకు ఇండియాను వదిలిపెట్టి యూఏఈలో అడుగుపెట్టిన ఐపీఎల్–13కు సర్వం సిద్ధమవుతోంది. అరబ్ కంట్రీలో అడుగుపెట్టిన ఎనిమిది టీమ్లు పూర్తిస్థాయి ట్రెయినింగ్ మొదలుపెట్టగా, బీసీసీఐ కూడా తనసైడ్ వర్క్ను కంప్లీట్ చేస్తోంది. ఇందులో భాగంగా మ్యాచ్ వేదికలైన అబుదాబి, షార్జా, దుబాయ్ స్టేడియాల్లో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నది. ఈ నెల 19న అంటే మరో 9 రోజుల్లో చెన్నై సూపర్కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య అబుదాబిలో జరిగే తొలి మ్యాచ్తో ధనాధన్ లీగ్కు తెరలేవనుంది. మూడు వేదికల్లో కలిపి లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్లు జరగనున్నాయి. ఎక్కడ ఎన్ని మ్యాచ్లు నిర్వహించాలో బీసీసీఐ ఇప్పటికే ప్లాన్ చేసింది..! మరి ఆ వేదికల విశేషాలేంటో చూద్దాం..!
షార్జా (షార్జా క్రికెట్ స్టేడియం)
ఇండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ కెరీర్లో కొన్ని బెస్ట్ పెర్ఫామెన్స్లకు షార్జా వేదికగా నిలిచింది. అలాంటి ప్రఖ్యాత స్టేడియంలో ఐపీఎల్ లీగ్ దశలో 12 మ్యాచ్లు జరగనున్నాయి. 2014 సీజన్లో ఇక్కడ కేవలం ఆరు మ్యాచ్లే జరిగాయి. 1982లో నిర్మితమైన షార్జా క్రికెట్ స్టేడియం.. యూఏఈలోనే పురాతన మైనది.17 వేల మంది కెపాసిటీ ఉన్నప్పటికీ ఈసారి స్టాండ్స్ ఖాళీగానే ఉండనున్నాయి. ఈ స్టేడియంలో ఇప్పటిదాకా 9 టెస్టులు, 240 వన్డేలు, 14 టీ20లు జరిగాయి. నవంబర్ 3న ముంబై , హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్తో లీగ్ దశ పూర్తవుతుంది.
ఫస్ట్ మ్యాచ్
సెప్టెంబర్ 22న.. రాజస్తాన్ రాయల్స్ x చెన్నై సూపర్ కింగ్స్
216/6.. ఈ స్టేడియంలో జరిగిన టీ20ల్లో ఓ టీమ్ చేసిన హయ్యెస్ట్ స్కోరు. 2016లో జింబాబ్వేపై అఫ్గాన్ ఈ స్కోరు చేసింది.
అబుదాబి (షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం)
ఈ సీజన్ షూరూ అయ్యేది ఈ స్టేడియంలోనే. లీగ్ దశలో 20 మ్యాచ్లు జరుగుతాయి. 2014లో షేక్ జాయెద్ స్టేడియంలోనే తొలి దశ లీగ్ మ్యాచ్లు ఎక్కువగా జరిగాయి. ఈ స్టేడియం కెపాసిటీ 20వేలు. కానీ, కరోనా ప్రోటోకాల్స్ వల్ల ప్రస్తుతం స్టేడియంలోకి ఎవ్వరిని అనుమతించడం లేదు. అయితే లీగ్ స్టేజ్ చివర్లో పలు మ్యాచ్లకు ఈ స్టేడియంలోకి ఫ్యాన్స్ను అనుమతించే చాన్స్ ఉంది. 2006లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన వన్డే.. ఈ స్టేడియంలో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్. 2010 ఫిబ్రవరిలో స్కాట్లాండ్, అఫ్గానిస్తాన్ మధ్య తొలి ఇంటర్నేషనల్ టీ20 జరిగింది. అదే ఏడాది నవంబర్లో పాక్, సౌతాఫ్రికా జట్లు ఇక్కడ తొలిసారిగా ఓ టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాయి. ఇప్పటిదాకా ఇక్కడ 13 టెస్టులు, 45 వన్డేలు మరో 45 ఇంటర్నేషనల్ టీ20లు జరిగాయి. ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ అబుదాబినే తమ బేస్గా ఎంచుకున్నాయి. అయితే, యూఏఈలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే అబుదాబిలో కరోనా ప్రొటోకాల్స్ కఠినంగా అమలు చేస్తున్నారు.
ఫస్ట్ మ్యాచ్
సెప్టెంబర్19న ముంబై ఇండియన్స్ x చెన్నై సూపర్ కింగ్స్
225/ 7.. ఈ స్టేడియంలో జరిగిన టీ20ల్లో ఓ టీమ్ హయ్యెస్ట్ స్కోరు. 2013లో అఫ్గానిస్తాన్పై ఐర్లాండ్ ఈ స్కోరు చేసింది.
దుబాయ్ (దుబాయ్ క్రికెట్ స్టేడియం)
2014 నుంచి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంకు ఐపీఎల్తో అనుబంధం ఉంది. అప్పట్లో చాలా తక్కువ మ్యాచ్లు ఈ స్టేడియంలో జరిగాయి. కానీ ఈ సారి లీగ్ దశలోని మొత్తం 56 మ్యాచ్ల్లో అత్యధికంగా 24 మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనుంది. 25 వేల మంది కెపాసిటీ ఈ స్టేడియం సొంతం. కానీ కరోనా కారణంగా ఖాళీ స్టేడియంల్లోనే మ్యాచ్లు పూర్తి చేయాల్సిన పరిస్థితి. లీగ్ స్టేజ్ చివర్లో ఇక్కడ జరిగే మ్యాచ్లకు ఫ్యాన్స్ను అనుమతించే చాన్స్ ఉందని ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి. కాగా 2009 నుంచే ఈ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ స్టేడియంలో ఇప్పటిదాకా 13 టెస్టులు, 34 వన్డేలు, 62 టీ20 మ్యాచ్లు జరిగాయి. మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఐపీఎల్–13 కోసం యూఏఈ వచ్చిన ఎనిమిది ఫ్రాంచైజీల్లో ఆరు జట్లు దుబాయ్నే బేస్ గా ఎంచుకున్నాయి. ఇక్కడి ఐసీసీ అకాడమీలోనే ట్రెయినింగ్ చేస్తున్నాయి.
ఫస్ట్ మ్యాచ్
సెప్టెంబర్ 20న ఢిల్లీ క్యాపిటల్స్ x కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
211/3 .. ఈ స్టేడియంలో జరిగిన టీ20ల్లో ఓ టీమ్ హయ్యెస్ట్ స్కోర్, 2013లో పాకిస్తాన్పై శ్రీలంక చేసింది.
For More News..