మోసాలకు కేరాఫ్​ కేసీఆర్ : తీన్మార్ మల్లన్న

మోసాలకు కేరాఫ్​ కేసీఆర్ : తీన్మార్  మల్లన్న
  •    దొంగ హామీలిచ్చి ప్రజలను ముంచిండు
  •     కాంగ్రెస్  ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్  తీన్మార్  మల్లన్న
  •     కేసీఆర్​ ను ప్రజలు తరిమికొడతారని కామెంట్

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : మోసాలకు కేరాఫ్ అడ్రస్  సీఎం కేసీఆర్  అని కాంగ్రెస్​ ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్​ మల్లన్న విమర్శించారు. పేదలకు డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు ఇస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని దొంగ హామీలిచ్చి ప్రజలను సీఎం మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​లో కాంగ్రెస్​ తరపున నిర్వహించిన రోడ్​షో లో మల్లన్న మాట్లాడారు. సీఎం కేసీఆర్​ మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఈసారి కేసీఆర్ ను ప్రజలు తరిమికొట్టడం ఖామయన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం కేసీఆర్​ రూ.లక్షన్నర కోట్లు తిన్నడు. సీఎం తిన్న ఆ లక్షన్నర కోట్లను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గుంజుతం.

పేదలకు ఒక్క డబుల్​ బెడ్రూమ్ ఇల్లు కూడా బీఆర్ఎస్  ప్రభుత్వం కట్టివ్వలేదు. రాష్ట్రంలో వైన్స్​షాపుల నోటిఫికేషన్లు సక్రమంగా జరుగుతాయి. కానీ ఉద్యోగ నియామకాలు మాత్రం జరగవు. గ్రూప్ 1 పరీక్ష ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. గ్రూప్ 2  పరీక్ష కూడా వాయిదా పడింది. గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా ఆగిపోతాయి. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్  చెలగాటం ఆడిండు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను కూడా కేసీఆర్  మోసం చేసిండు” అని మల్లన్న విమర్శించారు.  

స్టేషన్​ఘన్​పూర్​లో కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ను  ఓడించేందుకు ముగ్గురు ఏకమైనా, అది జరగని పని అని ఆయన చెప్పారు.  కడియం శ్రీహరి గెలిస్తే రేషన్​ కార్డులను తొలగించే కుట్ర చేస్తున్నారని మల్లన్న ఆరోపించారు. ఈ ప్రచార కార్యక్రమంలో జడ్పీ స్టాండింగ్​ కమిటీ చైర్మన్​ మారపాక రవి, మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి, ఎంపీటీసీ సింగపురం దయాకర్  తదితరులు పాల్గొన్నారు.