వరుస సెలవులతో తిరుమలకు భారీగా భక్తులు

 వరుస సెలవులతో తిరుమలకు భారీగా భక్తులు
  • ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం
  • సర్వదర్శనానికి 30 గంటలకు పైగా సమయం 

తిరుపతి: వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. కొండపై ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్  లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నడక మార్గం నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి..ఆంక్షల కారణంగా దర్శనాలు, మొక్కుబడులు చెల్లించుకోలేకపోయిన భక్తులు ఇప్పుడు వరుస సెలవు రోజులు కావడంతో భారీగా తరలివచ్చారు.

చుట్టుపక్కల రాష్ట్రాల నుండి భారీగా తరలివస్తుండడంతో తిరుమల క్షేత్రంలో రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. భక్తుల సంఖ్య పెరగడంతో సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనంలో మాత్రమే భక్తులను దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలకుపైగా సమయం పడుతుండగా..సర్వదర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతోందని అంచనా. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, పాలు, నీళ్లు, అల్పాహారం అందిస్తున్నారు. తిరుపతిలో వసతి ఉన్న భక్తులే తిరుమల దర్శనానికి రావాలని అధికారులు సూచిస్తున్నారు.