తిరుపతి లోక్సభ, నాగార్జునసాగర్ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 7 గంటల వరకు సాగింది. సాయంత్రం 7 గంటలలోపు క్యూలో నిల్చున్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. కాగా.. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కరోనా పేషంట్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. మే2న ఈ రెండు స్థానాలకు కౌంటింగ్ జరపనున్నారు. సాగర్ కౌంటింగ్ నల్గొండలో జరగనుండగా.. తిరుపతి కౌంటింగ్ అక్కడే చేయనున్నారు.
నాగార్జునసాగర్లో సాయంత్రం 5 గంటల వరకు 81 శాతం పోలింగ్ నమోదైంది. దీన్ని బట్టి చూస్తే సాగర్లో గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్ల శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ శాతం గతంతో పోలిస్తే భారీగా తగ్గింది. 2019 ఎన్నికల్లో తిరుపతిలో 78 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు కేవలం 55 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కావడం గమనార్హం.