
తిరుమల శ్రీవారి దర్శనానికి జూన్ 11 నుండి సాధారణ భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. జూన్ 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులను, 10వ తేదీన స్థానికులతో శ్రీవారి దర్శనాల ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకూ మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుందని వైవీ స్పష్టం చేశారు. ఇవాళ(శుక్రవారం) తిరుమలలో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో టీటీటీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరాలను తెలిపారు. ఆన్లైన్లో టికెట్లు తీసుకుని భక్తులు రావాలని, తిరుపతి అలిపిరి దగ్గర కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. 10 ఏళ్ల లోపు చిన్నారులకు, 65 ఏళ్లు పైబడినవారికి దర్శనానికి అనుమతి లేదన్నారు. వీఐపీ దర్శనానికి కేవలం గంట మాత్రమే అనుమతి ఉంటుందని, శ్రీవారి మెట్ల మార్గాన్ని ఇంకొన్ని రోజులు అనుమతించబోమన్నారు. పుష్కరిణిలోకి భక్తులను అనుమతించమని స్పష్టం చేశారు. రోజుకి 7వేల మంది భక్తులకు మాత్రమే స్వామి వారి దర్శనం కల్పించడానికి అవకాశముందన్నారు. అలిపిరి దగ్గర ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు.
అంతేకాదు స్వామి వారి దర్శానికి వచ్చే భక్తులు ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. మాస్క్ లు, శానిటైజర్లు తప్పనిసరిగావాడాలన్నారు. తిరుమలలో ప్రధానంగా నాలుగు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు టీటీడీ చైర్మన్. శ్రీవారి హుండీ, కళ్యాణ కట్ట, అన్నప్రసాద కేంద్రం, తీర్ధం చఠారీ దగ్గర సమస్యలున్నాయని తెలిపారు. కళ్యాణకట్టలో తలనీలాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని చెప్పారు. అన్నప్రసాద కేంద్రం దగ్గర చేతులు శుభ్రపరుచుకోనే ప్రాంతంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.తీర్థం చఠారీ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కంటైన్మెంట్ జోన్ల లోని భక్తులను ఎట్టి పరిస్థితుల్లోఅనుమతించబోమని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి.