
సీఎం కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ కుప్పకూలిపోయిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ చౌరస్తాలో టీజేఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమరదీక్షలో కోదండరామ్ పాల్గొన్నారు. ఎనిమిదేండ్లుగా బాసర ట్రిపుల్ ఐటీలో రెగ్యులర్ వీసీ లేకపోవడం బాధాకరం అన్నారు. అందుకే సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు.
క్యాంపస్ లో పోలీసులను అడ్డంపెట్టుకొని సర్కార్ దౌర్జన్యానికి పాల్పడుతుందని కోదండరామ్ ఆరోపించారు. దేశంలో అన్ని రాష్ట్రాలు విద్యపై 15శాతం ఖర్చు చేస్తుంటే.. తెలంగాణ మాత్రం 6శాతం మాత్రమే ఖర్చు చేస్తోందన్నారు. క్యాంపస్ లోకి తల్లిదండ్రులను అనుమతిస్తే.. సమస్యలు బయటపడుతాయనే భయంతో.. వారిని అరెస్టులు చేయిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరించి.. విద్యార్థులపై అక్రమ కేసులు ఎత్తివేయ్యాలని డిమాండ్ చేశారు కోదండరామ్.