
తిరుపతి: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామి ధనుస్సు ధరించి కోదండరాముని అలంకారంలో దర్శనమిచ్చారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. కరోనా నిబంధనల నేపధ్యంలో ఉత్సవాలన్నీ ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించారు. కాగా, మధ్యాహ్నం 3 గంటలకు పుష్పక విమానం, రాత్రి 7 గంటలకు గజ వాహనసేవ జరుగుతాయి. కార్యక్రమంలో శ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీ చిన్నజీయర్స్వామి, ఈవో డా. కెఎస్.జవహర్రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డా. నిశ్చిత, చిప్పగిరి ప్రసాద్, గోవిందహరి, డిపి.అనంత, విజిలెన్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ రమేష్రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్మోహనాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.