- ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ
- సాయంత్రం 4 గంటలకల్లా పూర్తి ఫలితాలు
- మొదట 25 బ్యాలెట్ పేపర్లకో బండిల్
- ఒక్కో రౌండ్లో వెయ్యి ఓట్ల చొప్పున లెక్కింపు
- విధుల్లో 10 వేల మందికి పైగా ఉద్యోగులు
- కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
- పలుచోట్ల జోరుగా బెట్టింగ్లు
హైదరాబాద్, వెలుగు: జడ్జిమెంట్ డే వచ్చేసింది. నువ్వా, నేనా అన్నట్లుగా సాగిన మున్సిపల్ ఎన్నికల్లో విజేతలెవరో శుక్రవారం తేలిపోనుంది. కౌంటింగ్కు రాష్ట్రవ్యాప్తంగా 123 చోట్ల ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.116 మున్సిపాలిటీల్లో 2,569 వార్డుల నుంచి 10,179 మంది, ఏడు కార్పొరేషన్ల పరిధిలోని 412 డివిజన్ల నుంచి 2,225 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిలో గెలిచేదెవరో, ఓడేదెవరో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఏ బల్దియా ఎవరి చేతుల్లోకి వెళ్తుందో మరి కొద్ది గంటల్లో క్లారిటీ వస్తుంది.
దీంతో ఫలితాలపై రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు, ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. డివిజన్ల సంఖ్య ఎక్కువగా ఉండే కార్పొరేషన్లలో అన్ని డివిజన్ల కౌంటింగ్ ఏకకాలంలో ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రతి డివిజన్లో పోలైన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీల్లో మాత్రం రిటర్నింగ్ ఆఫీసర్ల సంఖ్య ప్రకారం టేబుళ్లు వేశారు. ఒక వార్డు తర్వాత, మరొకటి చొప్పున ఒక్కో ఆర్వోకు కేటాయించిన వార్డులన్నీ లెక్కిస్తారు. ఒక్కో డివిజన్/వార్డు లెక్కింపు గరిష్టంగా ఐదు రౌండ్లలో పూర్తవుతుంది. కౌంటింగ్ సెంటర్ల లోపల, బయట సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. సెంటర్ల దగ్గర ఎలాంటి గొడవలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో ఏయే డివిజన్లో ఎవరు గెలుస్తారు? ఆయా బల్దియాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? మేయర్, చైర్ పర్సన్ సీటు ఎవరికి దక్కుతుంది? లాంటి అంశాలపై పలుచోట్ల జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి.
25 బ్యాలెట్ పేపర్లకో బండిల్..
శుక్రవారం ఉదయం 8 గంటలకు అన్నికేంద్రాల్లో కౌంటింగ్ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత స్ట్రాంగ్ రూమ్లలో వార్డులు, డివిజన్ల వారిగా భద్రపరిచిన సీల్డ్ బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ సెంటర్లోని లెక్కింపు టేబుల్ వద్దకు తీసుకొస్తారు. కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల ఎదుట సీల్ ఓపెన్ చేస్తారు. ఒక డివిజన్లో సగటున 3 నుంచి 5 బ్యాలెట్ బాక్స్లు, మున్సిపల్ వార్డుల్లో అయితే ఒకటి నుంచి 3 వరకు బ్యాలెట్ బాక్స్లను ఓటింగ్ కోసం ఉపయోగించారు. ఇలా ఆ వార్డు, డివిజన్లో ఉపయోగించిన మొత్తం బ్యాలెట్ బాక్సులను ఒకే సారి ఓపెన్ చేసి అన్ని ఓట్లను ఒక డ్రమ్ములో పోసి వాటిని పూర్తిగా కలుపుతారు. ఆ తర్వాత 25 బ్యాలెట్ పత్రాలను ఒక బండిల్ లాగా చేసి అలా 40 బండిల్స్ను అంటే వెయ్యి ఓట్లను ఒక కట్టగా కట్టి టేబుళ్లపై పెడతారు. బ్యాలెట్లు 25 కంటే తక్కువగా ఉంటే వాటిని ప్రత్యేక బండిల్గా తయారు చేసి కౌంట్తో లేబుల్ చేస్తారు.
ప్రతీ బ్యాలెట్ పేపర్ను ఏజెంట్లకు చూపిస్తూ లెక్కింపు
వెయ్యి ఓట్ల బండిల్తీసుకొని కట్ట నుంచి విప్పిన ప్రతి బ్యాలెట్ పేపర్ను కౌంటింగ్ ఏజెంట్లకు చూపి స్తారు. అవి చెల్లే ఓట్లు అయితే ఏ అభ్యర్థికి ఓటు పడిందో ఆ అభ్యర్థికి జమ చేస్తారు. పోటీ చేసే ప్రతి అభ్యర్థికి, నోటా, అనుమానాస్పద ఓట్లకు కంపార్ట్మెంట్లతో కూడిన చెక్క ట్రేలను ఉపయోగిస్తారు. ఆ తర్వాత ప్రతి అభ్యర్థికి పడిన ఓట్ల నుంచి 100 ఓట్లను ఒక బండిల్ చేస్తారు. అనుమానాస్పద ఓట్లు, నోటా ఓట్లను కూడా బండిల్ కడతారు. ఆ తర్వాత ఓట్లను లెక్కించి రౌండ్ల వారీగా ఫలితాలు ఓ పేపర్పై రాసి కౌంటింగ్ సూపర్ వైజర్ సంతకం చేస్తారు. ప్రతీ రౌండ్ కౌంటింగ్ తర్వాత ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్లుగా రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. వెయ్యి ఓట్ల లోపు ఉన్న వార్డుల ఫలితాలు మొదటి రౌండ్లో, రెండు వేల ఓట్ల లోపు ఉన్నవి రెండో రౌండ్లో, మూడు వేలకు పైగా ఓట్లు ఉంటే మూడో రౌండ్లో, గరిష్టంగా ఐదో రౌండ్లో తేలుతాయి. శుక్రవారం మధ్యాహ్నం 4 గంటల వరకు అన్నీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. బ్యాలెట్ పేపర్లను వెయ్యి ఓట్ల కట్టలు కట్టడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుందని, ఆ తర్వాత అభ్యర్థుల వారీగా కౌంటింగ్ వివరాలు త్వరగానే తెలిసిపోతుందని చెప్పారు.
సెల్ఫోన్లు.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్పై నిషేధం!
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను నిషేధించినట్లు ఆమె పేర్కొన్నారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తామని ప్రకటించారు. అదికూడా చెల్లుబాటు అయ్యే పాస్లతో మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. అన్ని కౌం టింగ్ సెంటర్లలో కలిపి మొత్తం 10,800 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని చెప్పారు.
