- 24 మంది వివరాలువెల్లడించిన టీ న్యాబ్
- పరారీలో నలుగురు పెడ్లర్లు,17 మంది కన్జ్యూమర్లు
- నాంపల్లి కోర్టులో నిందితులను ప్రొడ్యూస్ చేసిన పోలీసులు
హైదరాబాద్, వెలుగు: ఫిల్మ్ ఫైనాన్షియర్ వెంకటరత్నా రెడ్డి డ్రగ్స్ పార్టీల కేసులో టీ న్యాబ్దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల వాట్సాప్, కాల్ డేటా ఆధారంగా డ్రగ్స్ కస్టమర్ల వివరాలు సేకరిస్తున్నది. వెంకటరత్నా రెడ్డి నిర్వహించిన డ్రగ్స్ పార్టీల్లో టాలీవుడ్కు చెందిన కొంతమంది ఆర్టిస్టులు, పలువురు వ్యాపారవేత్తలు, పొలిటికల్ లీడర్లు కూడా పాల్గొన్నట్టు గుర్తించింది.
వాళ్లకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నది. మాదాపూర్ విఠల్నగర్లో బుధవారం రాత్రి టీ న్యాబ్ పోలీసులు అదుపులో తీసుకున్న వెంకటరత్నా రెడ్డితో పాటు రైల్ నిలయం సీనియర్ స్టెనో గ్రాఫర్ మురళి, డ్రగ్ సప్లయర్, మాజీ నేవీ ఉద్యోగి బాలాజీని శుక్రవారం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్ట్లో టీ న్యాబ్ పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు.
డ్రగ్ కన్జ్యూమర్లుగా సినీ, రాజకీయ ప్రముఖులు!
ముగ్గురు నైజీరియన్స్, వైజాగ్కు చెందిన డ్రగ్ పెడ్ల ర్తో పాటు మరో 17 మంది కస్టమర్ల పేర్లను టీన్యాబ్ పోలీసులు వెల్లడించారు. ఇందులో కర్నాటక డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న కలహర్ రెడ్డి, సుశాంత్ రెడ్డితో పాటు రామ్చంద్, అర్జున్, ఉప్పలపాటి రవి, ప్రణీత్, సందీప్, సూర్య, శ్వేత, కార్తిక్, హిటాచి, నర్సింగ్, మహ్మద్ అజీమ్, అమ్జద్, ఇంద్రతేజ, సురేశ్, రామ్కుమార్, మరికొంత మంది ఉన్నారు. ఏపీ, తెలంగాణలో వెంకటరత్నా రెడ్డిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి.
ఫైనాన్షియర్ ముసుగులో మోసాలు
ఫైనాన్స్ పేరుతో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు నిర్మాతలను వెంకటరత్నా రెడ్డి రూ.30లక్షల వరకు మోసం చేసినట్లు తెలిసింది. ఐఆర్ఎస్ అధికారి అని చెప్పుకుని పెండ్లి పేరుతో ఓ మహిళా అధికారిని చీటింగ్ చేసినట్లు సమాచారం. వెంకటరత్నా రెడ్డి, బాలాజీ కాల్ లిస్ట్, వాట్సాప్ చాటింగ్ డేటాను టీ న్యాబ్ పోలీసులు సేకరిస్తున్నారు. వాటి ఆధారంగానే అనుమానితులను విచారించనున్నారు.