- సిట్ సేకరించిన డిజిటల్ ఆధారాలు ఏమైనయ్
- ఈడీ జాయింట్ డైరెక్టర్ను కలిసిన పీసీసీ చీఫ్
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ కేసుల్లో నిజాలు బయటపడకుండా రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతున్నదని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు. ఎక్సైజ్ సిట్ సేకరించిన చేసిన డిజిటల్ ఆధారాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. ఈడీ దర్యాప్తుకు సహకరించని రాష్ట్ర సర్కార్పై కోర్టు ధిక్కారం కింద కేసులు పెట్టాలని సూచించారు. హైకోర్టు ఆదేశాలను పాటించకపోతే రాష్ట్ర ప్రభుత్వం,ఈడీపై మరోసారి కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో జరుగుతున్న ఆలస్యంపై శుక్రవారం ఈడీ జాయింట్ డైరెక్టర్ను కలిశారు. 2017 నుంచి రాష్ట్రంలో రిజిస్టరైన డ్రగ్స్ కేసులకు సంబంధించిన వివరాలు, కోర్టు తీర్పులను అందజేశారు. తర్వాత మీడియాతో రేవంత్ మాట్లాడారు. ఈడీ అధికారుల దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. 2023 మార్చిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఆ వెంటనే డ్రగ్స్ కేసులతో సంబంధం ఉన్న వ్యక్తులను చార్మినార్ వద్ద బట్టలు విప్పి తిప్పుతామని హెచ్చరించారు.
డ్రగ్స్ దందాను కేసీఆర్ ఒప్పుకున్నరు
కాంగ్రెస్ హయాంలో జూబ్లీహిల్స్లో 4 పబ్స్ మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 90 దాకా ఉన్నాయని రేవంత్ చెప్పారు. 2016 నుంచి తాము చేస్తున్న ఆరోపణలను కేసీఆర్ ఈ ఏడాది ఒప్పుకున్నారన్నారు. రాష్ట్రంలో గుట్కా, మట్కా, గుడుంబా, పేకాట లేదని సీఎం ఎన్నోసార్లు చెప్పారని.. డ్రగ్స్ గురించి మాట్లాడితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని కేటీఆర్ లాంటి వాళ్లు ప్రగల్భాలు పలికారన్నారు. డ్రగ్స్ దందాపై పలు విచారణ సంస్థలకు ఫిర్యాదు చేశానన్నారు. ఎంపీ సంతోష్ గ్రీన్ చానల్లో చాలెంజ్ చేస్తున్నాడని.. అలాగే విశ్వేశ్వర్రెడ్డి, కేటీఆర్కి తను డ్రగ్స్పై వైట్ చాలెంజ్ విసిరానని చెప్పారు. ట్విట్టర్లో ట్యాగ్ చేసిన కేటీఆర్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు