2026 ఫిబ్రవరిలో జరగనున్న టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభ వేడుకలు ఇటీవల హైదరాబాద్లో జరిగాయి. లెజెండరీ క్రికెటర్స్ కపిల్ దేవ్, వీరేంధ్ర సెహ్వాగ్, సురేశ్ రైనా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నటుడు వంశీ చాగంటి ఈబిజీ గ్రూప్ ఇర్ఫాన్ఖాన్, హరితో కలిసి టాలీవుడ్ ప్రో లీగ్ను ఏర్పాటు చేశారు.
ఫిబ్రవరి 13,14,15, 21,22 తేదిల్లో ఐదురోజుల పాటు ఉప్పల్ స్టేడియంలో ఈ క్రికెట్ సమరం జరగనుంది. ఆరు టీమ్లు పాల్గొనబోతున్నాయి. సినిమా ఇండస్ట్రీ 24 శాఖల్లో పనిచేసే అందరూ కలిసి క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుండి పుట్టిందే టాలీవుడ్ ప్రో లీగ్’ అని ఫౌండర్స్లో ఒకరైన వంశీ చాగంటి చెప్పారు. దీని ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు అందిస్తామని నిర్వాహకులు ఇర్ఫాన్ఖాన్, హరి తెలిపారు. దీన్ని తెలుగు సినిమా అలయ్–బలయ్గా ఫీలవుతున్నానని దిల్ రాజు అన్నారు.
ప్రో లీగ్ లోగో, జెర్సీలను, విన్నర్స్ కప్ను కపిల్, సెహ్వాగ్, సురేశ్రైనా, దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్, ఇర్ఫాన్ ఖాన్, సోనూసుద్, రాశీఖన్నా, హరి చేతుల మీదుగా విడుదల చేశారు. నటులు అశిష్ విద్యార్థి, మురళీ శర్మ, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, రాజీవ్ రెడ్డి, నాగవంశీ, దర్శకులు అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను తదితరులు పాల్గొన్నారు.
