
సినీ కార్మికుల సమ్మెతో గురువారం టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కార్మికుల వివాదంపై ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ సభ్యులు ఫిలిం ఛాంబర్ లో సమావేశమైయ్యారు. సినీ కార్మికుల వేతనాల పెంపు, వారి సమస్యలపై ఇరు వర్గాలు చర్చించాయి. ఈ చర్చలు దాదాపు గంట పాటు జరిగాయి. అయితే ఇరువర్గాల సమావేశం ముగిసిన అనతరం మళ్లీ వేరు వేరుగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయి.
దీన్నిబట్టి చూస్తే ఇరు వర్గాల చర్చలు కొలిక్కిరాలేదని తెలుస్తోంది. అయితే ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ సభ్యుల మధ్య జరిగిన చర్చలు మధ్యస్తంగా ముగిసినట్టు తెలుస్తోంది. ఇరువర్గాల మీటింగ్స్ తర్వాత మళ్లీ మరోసారి సంయుక్తంగా చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి కార్మికుల వేతనాల పెంపు వ్యవహారంలో స్పష్టత రానుంది.
ఫిలిం ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ తో జరిగిన ఈ చర్చలో ఛాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు సి.కల్యాణ్, ఎన్.వి ప్రసాద్, ప్రసన్న కుమార్, కిరణ్, సుప్రియ, కొల్లి రామకృష్ణ, సుధాకర్ రెడ్డి, ఠాగూర్ మధు హాజరయ్యారు.