
హైదరాబాద్, వెలుగు: మనదేశంలోనే అతిపెద్ద ఆట బొమ్మల వ్యాపార ప్రదర్శన 'టాయ్ బిజ్ ఇంటర్నేషనల్ 2025' ను ఢిల్లీ ప్రగతి మైదాన్లో జులై 4 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఏఐ) మాజీ ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి పవన్ గుప్తా తెలిపారు. ఈ ప్రదర్శనలో 350 పైగా భారతీయ ఆట బొమ్మల బ్రాండ్లు ఉంటాయన్నారు. 25 దేశాల నుంచి 10 వేలకు పైగా బయ్యర్లు పాల్గొననున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ రిటైల్ కంపెనీలు వాల్మార్ట్, హామ్లీస్ ఇండియా, ల్యాండ్మార్క్, లులూ గ్రూప్ వంటి సంస్థలు కూడా ఈ ఈవెంట్లో భాగం కానున్నాయని తెలిపారు.
ఆట బొమ్మల పరిశ్రమ 2015 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023లో ఎగుమతులు 239 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. ఆట బొమ్మల తయారీ రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ ప్రాముఖ్యత పెరుగుతుందని తెలిపారు. దీనికి దేశీయ విధానాలు, అంతర్జాతీయ వాణిజ్య మార్పులు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. చైనా నుంచి దిగుమతయ్యే మూడు వందల బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా ప్రభుత్వం 25 శాతం టారిఫ్ విధించిందన్నారు. వియత్నాం, ఇతర ఆగ్నేయాసియా దేశాల దిగుమతులపై పర్యవేక్షణను కఠినతరం చేసిందన్నారు. ఈ అవకాశాన్ని భారతీయ ఆట బొమ్మల తయారీదారులు అందిపుచ్చుకునేందుకు ముందుకు వస్తున్నారని గుప్తా వివరించారు.