- కేసీఆర్ నుంచి అధికారం గుంజుకుంటం
- అక్రమంగా సంపాదించిన ఆస్తులూ లాక్కుంటం
- మీడియాతో చిట్చాట్లో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
- నాది టీడీపీ కాంగ్రెస్సయితే కేసీఆర్ది టీడీపీ టీఆరెస్సా?
- టీఆర్ఎస్లో అంతా టీడీపీ వాళ్లే.. మంత్రుల్లో 75% వాళ్లే
హైదరాబాద్, వెలుగు: ‘కేసీఆర్ను తన్ని మరీ అధికారం గుంజుకుంటం. అధికారమే కాదు.. అక్రమంగా సంపాదించిన ఆస్తులూ లాక్కుంటం. నేను టీడీపీ నుంచి వచ్చానని అంటున్నరు. మరి కేసీఆర్ ఏడ్నుంచి వచ్చిండు. నేను చంద్రబాబు దగ్గర సహచరునిగా పని చేశా. కేసీఆరైతే బానిస లెక్క బతికిండు’ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన తన ఇంట్లో మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. కేటీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. అసలు కేటీఆర్కు జ్ఞానమే లేదని, నాలుగు ఇంగ్లిష్ ముక్కలు మాట్లాడినంత మాత్రానా ఆయన తోపు కాదని అన్నారు. కేటీఆర్ ఆంధ్రా పేరు పెట్టుకున్నాడని, దాన్ని మార్చుకోవాలని చెప్పారు. ‘కేటీఆర్ అని పిలిస్తే ఎన్టీఆర్ పరువు తీసినోళ్లమైతం. అందుకే ఇప్పటి నుంచి ఆయన్ను డ్రామారావు అని పిలుస్తా’ అని అన్నారు.
2004లో హరీశ్కు మంత్రి పదవిచ్చింది కాంగ్రెస్
టీఆర్ఎస్లో ఉన్నోళ్లంతా టీడీపీ వాళ్లేనని, మంత్రుల్లో 75 శాతం మంది అక్కడి నుంచి వచ్చిన వాళ్లేనని రేవంత్ చెప్పారు. కేసీఆర్ జీవితం, జీవనం అంతా తెలుగు దేశమేనన్నారు. ‘నాది టీడీపీ కాంగ్రెస్సయితే, కేసీఆర్ది టీడీపీ టీఆర్ఎస్సా’ అని ప్రశ్నించారు. పులి తోలును నక్క కప్పుకున్నట్టు తెలుగుదేశమోళ్లంతా టీఆర్ఎస్లో ఉన్నారని, అది చాలనట్లు ఇపుడు ఎల్. రమణను పిలిచారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్లకు టీడీపీ భిక్షమేస్తే హరీశ్రావుకు కాంగ్రెస్ భిక్ష పెట్టిందని చెప్పారు. 2009లో సిరిసిల్లలో కేటీఆర్ గెలవడానికి టీడీపీనే కారణమని, హరీశ్రావుకు 2004లో మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు.
కేంద్ర మంత్రి పదవిని కేసీఆర్ ఎంతకు కొన్నరు?
కేటీఆర్లా తాను రెడీమేడ్ కుర్చీలో కూర్చోలేదని.. 15 ఏళ్లు కష్టపడితే ఈ పొజిషన్లోకి వచ్చానని రేవంత్ చెప్పారు. పీసీసీ చీఫ్ అయినందుకు తనకు ప్రపంచాన్నే గెలిచినంత సంతోషంగా ఉందని కేటీఆర్ మాటలకు బదులిచ్చారు. భార్యాబిడ్డల మీద ఒట్టేసి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని సోనియాతో చెప్పిన కేసీఆర్.. బయటకు రాగానే మోసం చేయలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబమే మోసంతో బతుకుతోందన్నారు. పీసీసీ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న టీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ ఎంత పెట్టి కేంద్ర మంత్రి పదవి కొన్నారో అడగాలని సలహా ఇచ్చారు. ‘నేను పార్టీకి రాజీనామా చేసి విజయవాడలో అధ్యక్షుడికి లేఖ ఇచ్చా. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశా. ఎమ్మెల్యేల జీతభత్యాల అకౌంట్ను క్లోజ్ చేశా. ఈ పద్ధతిలో ఎంత మందిని టీఆర్ఎస్లో చేర్చుకున్నారో చెప్పాలె’ అని నిలదీశారు.
జలవివాదాల్లో ఇద్దరు సీఎంల సురభి నాటకాలు
జల వివాదాల్లో జగన్, కేసీఆర్లవి సురభి నాటకాలని రేవంత్ విమర్శించారు. వైఎస్ కాంగ్రెస్ ఆస్తి అని, ఆయన చివరి కోరిక రాహుల్ను ప్రధానిని చేయడమేనని అన్నారు. ఆయన చివరి కోరికను నెరవేరుస్తారా లేదా అని జగన్, షర్మిలను ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి తన వల్లే ప్రమోషన్ వచ్చిందని, తనకు పదవి రావడంతోనే ఆయనకు కేబినెట్ హోదా లభించిందని చెప్పారు. ఎన్డీయే సర్కారులో తెలుగు ప్రజలపై చిన్న చూపు ఉండేదని, అందుకే కేంద్ర మంత్రి పదవులు ఇవ్వలేదన్నారు. యూపీఏ హయాంలో 10 మంది కేంద్ర మంత్రులయ్యారని గుర్తు చేశారు. కిషన్రెడ్డి దమ్మున్న నేత కాదని, గ్రేటర్లో వరదలు వచ్చినపుడు విజిట్కు వెళ్తే ప్రొటోకాల్ ప్రకారం అధికారులు కూడా రాలేదని చెప్పారు.
హిమాన్షును చెడగొడ్తుంది కేటీఆరే
కేటీఆర్ కొడుకు హిమాన్షు చాలా మంచోడని, చిన్నప్పటి నుంచి తనకు తెలుసని రేవంత్ చెప్పారు. హిమాన్షను చెడగొడుతున్నది కేటీఆరేనని.. లేకపోతే 18 ఏండ్లు కూడా నిండకుండా రాజకీయాల గురించి మాట్లాడటమేం టని అన్నారు. 2023 మొదట్లోనే ఎన్నికలు వస్తాయని, కేసీఆర్ ముందస్తుగా సర్కారును రద్దు చేసుకొని ఎన్నికలకు వెళ్తారని రేవంత్ అంచనా వేశారు.