హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. తెలంగాణ కాంగ్రెస్ సారథి ఎవరనేది పార్టీ కేంద్ర నాయకత్వం సోమవారం ప్రకటించనున్నట్టు తెలిసింది. పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ తుది కసరత్తు చేస్తోందన్న సమాచారంతో రాష్ట్ర నేతలు హస్తిన బాట పట్టారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రెండ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీలో ఉన్నారు. పార్టీ చీఫ్ పదవి తమకే ఇవ్వాలని ముగ్గురు నేతలు హస్తినలో ఏఐసీసీ పెద్దలతో మంతనాలు నడుపుతూ.. లాబీయింగ్ చేస్తున్నారు.
మాణిక్కం ఠాగూర్తో వేర్వేరుగా మంతనాలు
తమిళనాడులో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మణిక్కం ఠాగూర్ శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ముగ్గురు నేతలు వేర్వేరుగా ఆయనతో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఇటు ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ఇతర ముఖ్య నేతలతో తుది విడత సంప్రదింపులు జరిపి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పార్టీ నాయకత్వం రేవంత్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఢిల్లీ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. రేవంత్కు పీసీసీ ఇచ్చే పక్షంలో మిగతా నాయకులకు ఏఐసీసీలో కీలక పదవులు దక్కవచ్చని ప్రచారంలో ఉంది.
‘సాగర్’ ఓటమితో మారిన సీన్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి పదవికి రాజీనామా చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ వాయిదా వేశారు. కొన్ని రోజుల క్రితమే కేరళకు కొత్త పీసీసీ చీఫ్ను ప్రకటించారు. దేశంలోని 12 రాష్ట్రాలకు కొత్త సారథులను ప్రకటించే కొత్త కసరత్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేశారు. ఎంపీ రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డిలలో ఒకరికి పీసీసీ పగ్గాలు దక్కే అవకాశముందని అప్పట్లో ఏఐసీసీ వర్గాల నుంచి లీకులు వచ్చాయి. సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత సీన్ మారింది. ఈ క్రమంలోనే పీసీసీ పగ్గాలు దక్కించుకునేందుకు ముగ్గురు నేతలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.