
నిర్మల్: విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాంపస్ లో నెలకొన్న సమస్యల సాధన కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం బాసరకు చేరుకున్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోలీసుల వలయాన్ని ఛేదించి రహస్యంగా గోడ దూకి లోపలికి ప్రవేశించారు. అనంతరం విద్యార్థుల వద్దకు చేరుకుని... వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా.. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని పోలీసులపై రేవంత్ మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.