మాట తప్పిన కవితను పాతాళానికి తొక్కిన్రు : రేవంత్ రెడ్డి

మాట తప్పిన కవితను పాతాళానికి తొక్కిన్రు : రేవంత్ రెడ్డి

కేసీఆర్ రెండు సార్లు అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ రేవంత్ పాల్గొన్నారు. కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా అని ప్రజలను అడిగారు.  ఈ ప్రాంతంలో పసుపు రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావని ఎకరాకు లక్ష 50వేలు పెట్టుబడి పెడితే వారికి ఆత్మహత్యలే దిక్కవుతున్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఆనాడు రత్నాకర్ రావు చేసిన అభివృద్దే తప్ప బీఆర్ఎస్ చేసిందేం లేదని విమర్శించారు. 

2011లో శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ కు మద్దతు తెలిపిందని రేవంత్ ఆరోపించారు. కోట్ల రూపాయలు తీసుకుని ఆనాడు ఈ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముడుపోయింది వాస్తవం కాదా.. ఆనాడు టీఆర్ఎస్ నుంచి నిన్ను సస్పెండ్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. తన ఓటును ఆంధ్రోళ్లకు అమ్ముకున్న విద్యాసాగర్ రావుకు మళ్లీ మళ్లీ కేసీఆర్ టికెట్ ఇచ్చారు..అంటే ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయిన దాంట్లో కేసీఆర్ వాటా ఎంతో చెప్పాలన్నారు. 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని కవిత హామీ ఇచ్చారు. పరిశ్రమను తెరవకపోతే గేటుకు ఉరేసుకుంటానని ఎమ్మెల్యే అన్నాడు. మాట తప్పిన కవితను పార్లమెంటు ఎన్నికల్లో పాతాళానికి తొక్కిండ్రు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావును ఎందుకు విడిచిపెట్టారని అని రేవంత్ ప్రశ్నించారు. 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరునెలల్లో చక్కెర పరిశ్రమను తెరుస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పసుపు బోర్డు తెస్తానన్న  అర్వింద్ బోర్డు తిప్పేశాడని ఎద్దేవా చేశారు. ఎన్నో త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని..తెలంగాణ తెచ్చిన అని చెప్పుకున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నేరవేర్చలేదని ఆరోపించారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేసీఆర్ ను అసదుద్దీన్ ఎందుకు ప్రశ్నించరని రేవంత్ నిలదీశారు. మాట తప్పాక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అని కోరారు. 

2024లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ జోస్యం  చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఇళ్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకుంటామని,  అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.