హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్బంగా నగరంలో పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్బంగా ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈనెల 6వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం ముగిసే వరకూ నెక్లెస్ రోడ్డులో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 

* నెక్లెస్ రోడ్డు : ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుండి వచ్చే ట్రాఫిక్ ను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించరు. ఐమ్యాక్స్ థియేటర్ మీదుగా మింట్ కాంపౌండ్ రోడ్డు వైపు ట్రాఫిక్ ను మళ్లించనున్నారు.

* తెలుగు తల్లి విగ్రహం వద్ద : అంబేద్కర్ విగ్రహం నుండి వచ్చే ట్రాఫిక్‌ను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించరు. ఇక్బాల్ మినార్ వైపు ట్రాఫిక్ ను మళ్లిస్తారు.

* నల్లగుట్ట బ్రిడ్జి వద్ద : మినిస్టర్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను పీవీ మార్గ్ వైపు అనుమతించరు. నెక్లెస్ రోడ్, నల్లగుట్ట వంతెన వద్ద కర్బలా వైపు మళ్లించనున్నారు. 

* బుద్ధ భవన్ వద్ద : బుద్ధ భవన్ నుండి వచ్చే ట్రాఫిక్ ను నల్లగుట్ట వంతెన, పీవీ రోడ్డు వైపునకు అనుమతించబడదు. నెక్లెస్ రోడ్, మినిస్టర్ రోడ్ వైపు వెళ్లాలనుకునే వాహనదారులు రాణిగంజ్ మీదుగా వెళ్లవచ్చు. 

* ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనానికి వచ్చే దుర్గామాత విగ్రహాల ట్రాఫిక్ రద్దీ బట్టి.. ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.