
హైదరాబాద్, వెలుగు: రంజాన్ ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా గురువారం సిటీలో ట్రాఫిక్ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రార్థనలు ఎక్కువగా జరిగే ఓల్డ్సిటీతోపాటు వేర్వేరు మసీదులు, ఈద్గాల వద్ద ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. మీర్ ఆలం ట్యాంక్ ఈద్గా, మాసబ్ట్యాంక్ హాకీ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్డెవర్షన్స్ఉంటాయని చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్సీపీ శ్రీనివాసరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లు చూసుకోవాలని చెప్పారు.
పురాణాపూల్, కామాటిపురా, కిషన్బాగ్ నుంచి మీర్ ఆలం ట్యాంక్ ఈద్గాలోని ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలను బహదూర్పురా క్రాస్ రోడ్స్ మీదుగా అనుమతిస్తారు. ఇతర వాహనాలను తాడ్బన్ మీదుగా మళ్లిస్తారు. శివరాంపల్లి, దానమ్మ హట్స్ నుంచి వచ్చే వాహనాలను దానమ్మ హట్స్ క్రాస్ రోడ్స్ వద్ద శాస్త్రీపురం, నవాబ్ సాహెబ్ కుంట మీదుగా మళ్లిస్తారు. కాలాపత్తర్ నుంచి మీర్ ఆలం ట్యాంక్ ఈద్గా వైపు సాధారణ వాహనాలను అనుమతించరు. కాలాపత్తర్ పీఎస్ వద్ద మోచీకాలనీ, బహదూర్పురా, శంషీర్గంజ్, నవాబ్ సాహెబ్ కుంట వైపు ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తారు.
పురాణాపూల్ నుంచి బహదూర్పురా వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర హెవీ వెహికిల్స్ను పురాణాపూల్ దర్వాజ వద్ద జియాగూడ, సిటీ కాలేజీ మీదుగా డైవర్ట్చేస్తారు. శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి నుంచి బహదూర్పురా వైపు వచ్చే ట్రాఫిక్ను ఆరాంఘర్ జంక్షన్ వద్ద దారి మళ్లిస్తారు. మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్స్ వద్ద ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ను డెవర్ట్చేస్తారు. మెహిదీపట్నం నుంచి వచ్చే వాహనాలను బంజారాహిల్స్ రోడ్ నంబర్1, అయోధ్య జంక్షన్ మార్గాల్లోకి డైవర్ట్ చేస్తారు.