మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. కారు ప్రమాదంలో నలుగురి మృతి

 మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. కారు ప్రమాదంలో నలుగురి మృతి

మహబూబాబాద్ జిల్లా: కేసముద్రం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. బైపాస్ రోడ్ లో గల పాడుబడిన బావిలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ముగ్గురిని పోలీసులు, స్థానికులు సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. బావిలో పడ్డ కారును బయటకు తీస్తుండగా తాడు తెగి మరోసారి బావిలో పడిపోయింది. ప్రమాదంలో గాయపడిన ఒకరిని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లికి చెందిన వారిగా గుర్తించారు. టేకులపల్లి నుంచి అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు లలిత, సురేష్, భద్రు, అచ్చాలిగా పోలీసులు గుర్తించారు. 

మృతుల్లో ఇద్దరు భార్యా భర్తలు, మరో ఇద్దరు తల్లీ కొడుకులు

కారు బోల్తా పడిన ఘటనలో భద్రు, అచ్చాలి భార్యా భర్తలు కాగా..  లిఫ్ట్ అడిగి ఎక్కిన తల్లీ కొడుకులు లలిత, సురేష్  కన్నుమూసిన విషయం విషాదం రేపింది. ప్రమాదంలో దీక్షిత్, సుమ, డ్రైవర్ బిక్కు ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. లిఫ్ట్ అడిగి చనిపోయిన తల్లీ కొడుకులు మహబూబాబాద్ జిల్లా వాసులు. మిగిలిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి శివారు గోల్య తండా కు చెందిన వారుగా గుర్తించారు.