- టిమ్స్ నుంచి రిమ్స్కు ఇద్దరు డాక్టర్ల బదిలీ
- రద్దు చేయకుంటే సమ్మెనే: డాక్టర్స్ అసోసియేషన్లు
- బెదిరింపులు పట్టించుకోమన్న డీఎంఈ రమేశ్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. రోగులకు మెడిసిన్, నీరు, ఫుడ్ఇతర సౌకర్యాలు కల్పించడంపై ఉన్నతాధికారులను ప్రశ్నించిన ఇద్దరు డాక్టర్లను గచ్చిబౌలి టిమ్స్ నుంచి ఆదిలాబాద్ రిమ్స్కు ట్రాన్స్ఫర్ చేశారు. టిమ్స్లో పనిచేస్తున్న డాక్టర్ అరుంధతి, డాక్టర్ వసీం కబీర్ను రిమ్స్కు ట్రాన్స్ఫర్ చేస్తూ డీఎంఈ రమేశ్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం (అడ్మినిస్ర్టేటివ్ గ్రౌండ్స్) కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అందులో పేర్కొన్నారు. అయితే టిమ్స్లో డాక్టర్లు సరిపోక ఇబ్బందులు అవుతుంటే, ఇక్కడ నుంచి డాక్టర్లు ట్రాన్స్ఫర్ చేయడం ఏంటని మిగతా డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం కక్ష సాధింపు నిర్ణయమేనని మండిపడుతున్నారు. పేషెంట్ల కనీస అవసరాలపై ప్రశ్నించినందుకే ఆఫీసర్లు వారిద్దరిపై కక్షగట్టినట్టు చెబుతున్నారు.
లేదంటే విధులు బహిష్కరిస్తాం..
ఇద్దరు డాక్టర్ల ట్రాన్స్ఫర్ పై సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సీరియస్గా స్పందించింది. టిమ్స్లో ఉన్న లోపాలను ప్రశ్నించినందుకే ట్రాన్స్ఫర్ చేశారని అసోసియేషన్ ప్రతినిధి, డాక్టర్ నరేశ్అన్నారు. వెంటనే ట్రాన్స్ఫర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ర్టవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్లో విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. గురువారం ఒక్కరోజు ప్రభుత్వానికి టైమ్ ఇస్తున్నామన్నారు. హెల్త్ రిఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా పరిగణిస్తున్నట్టు ప్రకటించింది. టిమ్స్లో టెస్టులకు ల్యాబ్ లేదని, సీటీ స్కాన్ లేదని, సరిపడా డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ లేరని అసోసియేషన్ ప్రెసిడెంట్, డాక్టర్ మహేశ్ తెలిపారు. అడ్మినిస్ట్రేషన్లో ఫెయిలైతున్న ఆఫీసర్లపై ఏం చర్యలు తీసుకుంటారో ప్రభుత్వ పెద్దలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డాక్టర్ల ట్రాన్స్ఫర్ పై జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రాన్స్ఫర్ ఉత్తర్వులను రద్దు చేసి, ఆ ఇద్దరినీ టిమ్స్లోనే కొనసాగించాలని అసోసియేషన్ ప్రెసిడెంట్, డాక్టర్ వి.నవీన్ డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో పెట్టినందుకే..: డీఎంఈ రమేశ్ రెడ్డి
హాస్పిటల్లో జరిగే అంశాలను సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకే ఆ ఇద్దరు డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేశామని డీఎంఈ రమేశ్రెడ్డి తెలిపారు. ‘ఏదైనా సమస్యలుంటే హాస్పిటల్ అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోవాలి. వారు స్పందించకపోతే నా దృష్టికి తేవాలి. అంతే తప్ప, సోషల్ మీడియాలో పెట్టి, హాస్పిటల్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తే ఊరుకోం.. డాక్టర్ల సమ్మె బెదిరింపులను పట్టించుకోం..’ అని ఆయన స్పష్టం చేశారు.