సివిల్​ సప్లయ్​ గోదాముల్లో బియ్యం స్టాక్​ నిల్​..నిలిచిన రేషన్​ సరఫరా

సివిల్​ సప్లయ్​ గోదాముల్లో బియ్యం స్టాక్​ నిల్​..నిలిచిన రేషన్​ సరఫరా
  •    ట్రాన్స్​పోర్ట్​ లారీలు లేక నిలిచిన రేషన్​ సరఫరా
  •     4 రోజుల తర్వాతే షాపులకు బియ్యం అలాట్ చేసే అవకాశం

మహబూబ్​నగర్, వెలుగు: సివిల్​సప్లయ్​ గోదాముల్లో స్టాక్ అయిపోయింది. స్టాక్​ లేకపోవడంతో పాటు బఫర్​ గోదామ్ ​నుంచి ఎంఎల్ఎస్​ పాయింట్​కు, అక్కడి నుంచి షాపులకు బియ్యం ట్రాన్స్​పోర్ట్ చేసే లారీలు రాక ఈ సమస్య ఉత్పన్నమైంది. 10 రోజులుగా రేషన్​ షాపులకు రావాల్సిన బియ్యం ఆగిపోవడంతో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.మహబూబ్​నగర్ ​జిల్లాలో 506  రేషన్ ​షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో 2,39,730 రేషన్, అంత్యోదయ, అన్నపూర్ణ​ కార్డులున్నాయి. వీటి ద్వారా ప్రతినెలా 42,00,988 మెట్రిక్​టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. మే 12 దాటినా ఇంత వరకు షాపులకు బియ్యం చేరలేదు.

 మహబూబ్​నగర్, జడ్చర్ల, దేవరకద్ర ఎంఎల్ఎస్​ పాయింట్ల నుంచి గత నెల 20 నుంచి షాపులకు బియ్యం స్టాక్​సరఫరా ప్రారంభించాల్సి ఉంది. ఈ బియ్యాన్ని ఉమ్మడి జిల్లాలోని రైస్​మిల్లుల నుంచి లారీల్లో  ట్రాన్స్​పోర్ట్ చేయాల్సి ఉంది. అయితే ట్రాన్స్​పోర్ట్​ లారీలు రాక సఫ్లై ఆగినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. స్టాక్​పాయింట్లలో అందుబాటులో ఉన్న వరకు బియ్యాన్ని జిల్లాలోని కొన్ని షాపులకు కేటాయించి, మిగతా వాటికి పెండింగ్​ పెట్టారు. ఈ షాపులకు బియ్యం సఫ్లై చేయడానికి మరో వారం టైమ్​ పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ట్రాన్స్​పోర్ట్​ కాంట్రాక్టర్​ ఒక్కరే..

ప్రభుత్వ కొనుగోలు సెంటర్ల నుంచి స్టాక్​ను లారీల్లో మిల్లులకు తరలించే ట్రాన్స్​పోర్ట్​ కాంట్రాక్టర్, రేషన్​బియ్యం ట్రాన్స్​పోర్ట్​ చేసే లారీల కాంట్రాక్టర్ ​ఒక్కరే కావడంతో సమస్య ఏర్పడుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. సెంటర్ల నుంచి వడ్లను తరలించేందుకు 45 నుంచి 50 లారీలు, రేషన్​బియ్యం టాన్స్​పోర్ట్​చేసేందుకు 12 లారీలకు అగ్రిమెంట్​ఉన్నట్లు సివిల్​సప్లయ్​ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే జిల్లాలో ప్యాడి ప్రొక్యూర్​మెంట్ జరుగుతున్నందున లారీలు ఎక్కువగా కొనుగోలు సెంటర్ల వద్దే ఉంటున్నట్లు తెలిసింది. 

బియ్యం జోకడంతో ఆలస్యం

ఆఫీసర్లు ఏప్రిల్ వరకు సంచుల లెక్కన బియ్యాన్ని రేషన్​షాపులకు సప్లయ్​ చేశారు. ఈ నెల నుంచి ప్రతీ డీలర్ ఎంఎల్ఎస్​ పాయింట్​కు వెళ్లి బయోమెట్రిక్​థంబ్ పెడితేనే, ఆ షాపుకు బియ్యం అలాట్​అవుతుంది. తర్వాత లారీల్లో స్టాక్​లోడ్​చేసి షాపుల్లో దింపుతున్నారు. అది కూడా సంచుల లెక్కన కాకుండా గ్రామంలో ఎన్ని కార్డులున్నాయి? వాటికి బియ్యం కేటాయింపులు ఎంత? అని బియ్యం జోకిన తర్వాత లారీల్లోకి స్టాక్​ ఎక్కిస్తున్నారు. ఈ ప్రాసెస్ కు ఎక్కువ సమయం పట్టడం వల్ల బియ్యం కేటాయింపుల్లో ఆలస్యం జరుగుతుందని డీలర్లు చెబుతున్నారు. గతంలో ప్రతీనెల 20వ తేదీ నుంచి షాపులకు  బియ్యం కేటాయింపులు ప్రారంభించి, 1వ తేదీలోపు పూర్తి చేసే వారని, ఈ సారి 24వ తేదీన కేటాయింపులు ప్రారంభించారని, రెండు వారాలు కావొస్తున్నా ఇప్పటి వరకు జిల్లాలో 60% షాపులకు ఇంకా స్టాక్​రాలేదని చెబుతున్నారు. 

నాలుగు రోజుల్లో అన్ని షాపులకు అలాట్​చేస్తాం

ప్రస్తుతం జిల్లాలో ప్యాడి ప్రొక్యూర్​మెంట్​జరుగుతోంది. ఈ ప్రాసెస్​త్వరగా పూర్తి చేయాలని ఆర్డర్స్​ వచ్చాయి. దాంతో లారీలు ఎక్కువగా కొనుగోలు సెంటర్ల వద్దకు వెళ్లాయి. కాంట్రాక్టర్​ ఒక్కరే కావడంతో ఆయనకు ఫోన్​చేసి చెప్పాం. నాలుగు రోజుల్లో అన్ని షాపులకు బియ్యం తరలించాలని ఆదేశించాం. రేషన్​లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. ఈ నెల 25 వరకు బియ్యం పంపిణీ చేస్తాం. డీలర్లకు కూడా ఈ విషయాన్ని చెప్పాం.

- బాలరాజు, డీఎస్ వో, మహబూబ్​నగర్​