హైదరాబాద్, వెలుగు: కేవలం తొమ్మిది రూపాయిల (ట్యాక్స్లు మినహాయించి)కే వియత్నాం వెళ్లే అవకాశాన్ని ఎయిర్లైన్ కంపెనీ వియట్జెట్ అందిస్తోంది. ఇండియన్ ట్రావెలర్లు, మొదటిసారిగా వియత్నాం వెళ్లేవారు, హనీమూన్ కోసం వెళ్లేవారు, అడ్వంచర్ ట్రావెల్స్ చేసే వాళ్లు, బిజినెస్ పర్సన్స్ కోసం తక్కువ రేటుకే వియత్నాం వెళ్లే అవకాశాన్ని ఇస్తోంది. న్యూఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు సిటీలను వియత్నాం క్యాపిటల్ హనోయి, ఇతర సిటీలు హో చి మిన్హ్, దా నంగ్, ఫు యుక్ సిటీలతో కలుపుతున్న 17 విమాన సర్వీస్ల్లోని మొత్తం 30 వేల టికెట్లను తక్కువ రేటుకే ఈ ఎయిర్లైన్ కంపెనీ అమ్ముతోంది. ప్రయాణించాలనుకునేవారు కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. లేదా వియట్జెట్ ఎయిర్ అప్లికేషన్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
వచ్చే నెల 26 వరకు కేవలం బుధవారం, గురువారం, శుక్రవారం నాడే ఈ ప్రమోషనల్ టికెట్స్ను బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ టికెట్స్ను కూడా వచ్చే నెల 15 నుంచి మార్చి 26, 2023 (పబ్లిక్ హాలిడేలు మినహాయించి) మధ్య ట్రావెల్ చేయడానికి బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబైకి హనోయి, హోచి మిన్హ్ సిటీకి మధ్య వారానికి 4 విమానాలను వియట్జెట్ నడుపుతోంది. ఢిల్లీ, ముంబై నుంచి ఫు యుక్ సిటీలకు మధ్య వారానికి 3–4 విమాన సర్వీస్లను సెప్టెంబర్ నుంచి స్టార్టవుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అదనంగా మరో 11 కొత్త రూట్లలో కూడా సర్వీస్లను అందిస్తామని, దీంతో వియట్జెట్ వియత్నాం–ఇండియా మధ్య నడుపుతున్న విమానసర్వీస్లు 17 కి చేరుకుంటాయని కంపెనీ పేర్కొంది. ట్రావెలర్లు ఇక నుంచి డైరెక్ట్గా ఇండియా నుంచి వియత్నాంకు వెళ్లొచ్చని వివరించింది. కేవలం వియత్నాం మాత్రమే కాకుండా ఇతర దక్షిణాసియా సిటీలకూ వెళ్లొచ్చని తెలిపింది.