న్యూఢిల్లీ: ఇండియా డబుల్స్ షట్లర్లు పుల్లెల గాయత్రి – ట్రీసా జాలీ ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ ఫైనల్స్ నుంచి తప్పుకున్నారు. ప్రాక్టీస్ సందర్భంగా ట్రీసా చీలమండకు గాయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్కు వెళ్లడానికి రెండు, మూడు రోజుల ముందు ప్రాక్టీస్లో ట్రీసా మడమ తిరగబడింది.
పొరపాటున తన పార్ట్నర్ కాలిపై అడుగు వేయడంతో ఈ గాయమైంది. ప్రస్తుతం ట్రీసా రెస్ట్ తీసుకుంటోంది. కోలుకోవడానికి నాలుగు వారాల టైమ్ పట్టొచ్చు. మే నెలాఖరులో జరిగే సింగపూర్ ఓపెన్లో బరిలోకి దిగే చాన్స్ ఉంది’ అని డబుల్స్ కోచ్ బి. సుమీత్ రెడ్డి వెల్లడించాడు.
ట్రీసా–గాయత్రి జోడీ దూరం కావడంతో వాళ్ల ప్లేస్లో శ్రుతి మిశ్రా–ప్రియాను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ఎంపిక చేసింది. ఇక థామస్ కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి ముందుగానే డెన్మార్క్కు వెళ్లనున్నారు.
టోర్నీ ప్రారంభానికి ముందు అక్కడ కొన్ని రోజులు శిక్షణ తీసుకోనున్నారు. ఈ టోర్నీలో ఇండియా.. చైనా, కెనడా, ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఉబెర్ కప్లో ఇండియా.. చైనా, డెన్మార్క్, ఉక్రెయిన్తో తలపడనుంది. ఈ నెల 24 నుంచి డెన్మార్క్లోని హోర్సెన్లో థామస్, ఉబెర్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి.

