లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. ఒక పక్క దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ)ను అమలు చేయాలని బీజేపీ చూస్తుంటే.. సీఎం మమత సంచలన ప్రకటన చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఏఏ) రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇంటింటికి రేషన్, బిపిఎల్ కుటుంబాలకు 10 ఉచిత గ్యాస్ సిలిండర్లు సహా పలు సంక్షేమ పథకాలతో ఆమె మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ మొత్తం దేశాన్ని నిర్బంధ శిబిరంగా మార్చిందని ఆరోపించారు. కేంద్రంలో ప్రతిపక్ష కూటమి ఇండియా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సీఏఏ, ఎన్ ఆర్ సీ రద్దు చేయబడుతుందని అన్నారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఎన్నికలు ఉండవు అని ఆమె ఆరోపించారు.
42 పార్లమెంట్ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19న జరగనున్నాయి. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జూన్ 1 వరకు ఏడు దశల్లో నిర్వహించబడతాయి. ఫలితాలను జూన్ 4న ప్రకటించనున్నారు.