ఓటేయనోళ్లపై ట్రోల్స్, కామెంట్స్ సోషల్ మీడియాలో పోస్టులు.. వైరల్​

ఓటేయనోళ్లపై ట్రోల్స్, కామెంట్స్  సోషల్ మీడియాలో పోస్టులు.. వైరల్​

గచ్చిబౌలి, వెలుగు: సిటీ ఓటర్లు, ఐటీ ఎంప్లాయీస్​ ఓటింగ్​కు దూరంగా ఉండడంతో సోషల్​ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్​శాతం తగ్గడం, పోలింగ్ కేంద్రాలు వెలవెలబోవడం లాంటి వాటిపై గురువారం సోషల్ మీడియాలో  పెద్ద ఎత్తున  మీమ్స్​ వైరల్ ​అయ్యాయి. వీటిని కొందరు ట్రోలింగ్ ​చేస్తూ కామెంట్స్ ​పెడుతున్నారు. సిటీలో ఏదైనా మాల్​ ఓపెన్ అయితే ​ రెండు, మూడు వారాల పాటు సిటీ జన్లతో కిటకిటలాడుతాయి. కానీ ఎన్నికల రోజున ఓటు వేసేందుకు వెళ్లకపోతుండగా.. పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయే అంటూ కొందరు మీమ్స్​షేర్​ చేస్తున్నారు. వీటికి కొందరూ ‘షాపింగ్​పై ఉన్న శ్రద్ధ ఓటింగ్​పై లేదాయే ’ అంటూ కామెంట్స్​ పెడుతున్నారు.

ఎన్నికల రోజు సెలవు ఇచ్చింది ఇంట్లో నిద్ర పోవడానికి కాదు పోయి ఓటు వేయండని, సినిమా రీ రిలీజ్​ ఉన్నప్పుడు, మాల్స్​లో షాపింగ్​ఆఫర్స్​ఉన్నప్పుడు క్యూలైన్​ కట్టి గంటల పాటు నిల్చొని ఉంటారు, కానీ పోలింగ్​ కేంద్రాల్లో ఒక గంట పాటు వేచి ఉండరని, ఇప్పుడు ఓటు వేయడానికి వెళ్లరు కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వస్తారు అని ట్రోలింగ్​ జోరుగా సాగుతుంది. తక్కువ పోలింగ్​ శాతం నమోదవడంతో మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతల్లో ఆందోళన నెలకొంది. ఎలక్షన్​కు ముందే ఓటు హక్కుపై   పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖలు, ఎన్నికల సంఘం వివిధ కార్యక్రమాలు, వాకథాన్​ల ద్వారా అవగాహన కల్పించింది.  అయినా ఐటీ ఉద్యోగుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఈసారి కూడా ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది ఓటింగ్​కు దూరంగా ఉన్నారు.