నాగర్ కర్నూల్, వెలుగు: రైతు చనిపోయినట్లు నమోదు చేసి సదరు రైతు పొలాన్ని అసైన్డ్ భూమిగా నమోదు చేసిన ఘటనలో డిప్యూటీ తహసీల్దార్ను సస్పెన్షన్ చేయగా, భూభారతి ఆపరేటర్ ను ఉద్యోగంలో నుంచి తొలగించారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన జంతుక మసన్న చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి, అతని భూమిని అసైన్డ్ భూమిగా మార్చారు. దీనిపై బాధిత రైతు కలెక్టర్ హేమంత కేశవ పాటిల్కు ఫిర్యాదు చేయగా, విచారణకు ఆదేశించారు.
రైతు చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించడమే కాకుండా ఆయన పేరిట ఉన్న పట్టా భూమిని అసైన్డ్ భూమిగా నమోదు చేసినట్లు తేలడంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. భూభారతి ఆపరేటర్ మూడవత్ జైపాల్ ను విధుల నుంచి తొలగించి, క్రిమినల్ కేసు నమోదు చేశారు. అప్పటి అచ్చంపేట డిప్యూటీ తహసీల్దార్ ఎ.అశోక్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేశారు.
