- 12 రోజుల సమ్మె టైమ్ శాలరీలు నిన్న జమ చేసిన సర్కారు
- రెండు, మూడు రోజుల్లో కరోనా టైమ్లో కట్ చేసిన జీతం!
- రూ.200 కోట్ల సీసీఎస్ బకాయిలూ చెల్లింపు
- ఎన్నికలయ్యాక జాబ్ సెక్యూరిటీ ఆర్డర్స్ అంటూ హామీ
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో ఆర్టీసీ ఎంప్లాయీస్ ఓట్లకు అధికార పార్టీ గాలం వేస్తోంది. పెండింగ్ ఫండ్స్ రిలీజ్ చేస్తూ మచ్చిక చేసుకుంటోంది. నెలల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది. సమ్మె టైమ్లో పెండింగ్లో ఉన్న 12 రోజుల శాలరీని ఎంప్లాయీస్ అకౌంట్లలో శనివారం జమ చేశారు. 200 కోట్ల సీసీఎస్ బకాయిలు కూడా చెల్లించినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కరోనా టైమ్లో కట్ చేసిన మూడు నెలల హాఫ్ శాలరీని పోలింగ్కు రెండు, మూడు రోజుల ముందు జమ చేయనున్నట్టు సమాచారం. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముగిశాక డ్రైవర్లు, కండక్టర్ల కోసం జాబ్ సెక్యూరిటీ ఆర్డర్స్ ఇస్తామని చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో మొత్తం 29 డిపోలున్నాయి. వీటి పరిధిలోని అన్ని విభాగాల్లో కలిపి సుమారు 25 వేల మంది వరకు పనిచేస్తున్నారు. వీరి ఫ్యామిలీల ఓట్ల కోసమే సర్కారుకు పెండింగ్ సమస్యలు గుర్తొచ్చాయని యూనియన్ల నాయకులు ఆరోపిస్తున్నారు.
సమ్మె తర్వాత వేధింపులు
సమ్మె తర్వాత ఆర్టీసీని సర్కారు పూర్తిగా దూరం పెట్టింది. యూనియన్ల ప్రత్యేక సదుపాయలన్నీ రద్దు చేయడమే కాకుండా కీలక లీడర్లను ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ చేశారు. ఈ క్రమంలోనే సంస్థలో అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఎంప్లాయీస్ చెబుతున్నారు. కేవలం ఓట్ల కోసమే మళ్లీ ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల టీఎంయూలోని కొందరు నేతలను మంత్రి పిలిపించుకుని మాట్లాడినట్లు తెలిసింది. ఆర్టీసీని ఆదుకుంటామని, సర్కారుకు అండగాఉండాలని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు.
200 కోట్ల సీసీఎస్ బకాయిలు..
ఆర్టీసీ ఎంప్లాయీస్ శాలరీల నుంచి కట్ చేస్తున్న సీసీఎస్ (క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ) డబ్బులను రెండేళ్ల నుంచి సొసైటీకి సంస్థ చెల్లించడంలేదు. ఇలా ఇప్పటి వరకు 900 కోట్లకు పైనే సీసీఎస్కు ఆర్టీసీ బకాయి పడింది. దీంతో 18 వేల లోన్ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే సమ్మె టైంలో ఆర్టీసీ చెల్లించాల్సిన డబ్బులపై సీసీఎస్ హైకోర్టుకు వెళ్లింది. ఆరు వారాల్లో సీసీఎస్కు 200 కోట్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయినా ఒక్కపైసా జమ కాలేదు. తాజాగా 200 కోట్ల బకాయిలను సీసీఎస్కు చెల్లించినట్టు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నా.. సీసీఎస్ అధికారులు మాత్రం చెల్లించలేదంటున్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ డబ్బులను అకౌంట్లలో జమ చేయనున్నట్లు తెలిసింది. దీని ద్వారా రిటైర్డ్ ఎంప్లాయీస్తోపాటు, ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది.
ఏడాది తర్వాత సమ్మె టైమ్ ఫుల్ శాలరీ..
గతేడాది దసరా ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ సమ్మెకు దిగారు. సర్కారు ఎన్ని ఆంక్షలు పెట్టినా కార్మికులు వెనక్కి తగ్గలేదు. ఆఖరికి కొన్ని షరతుల మేరకు డ్యూటీలో చేరారు. అదే సమయంలో డిసెంబర్ 1న సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఆర్టీసీ కార్మికులతో మీటింగ్నిర్వహించి పలు సమస్యలపై చర్చించారు. సమ్మె టైమ్లోని 55 రోజులు శాలరీని సర్కారే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు 43 రోజుల శాలరీనే చెల్లించారు. అప్పటి నుంచి 12 రోజుల జీతం పెండింగ్లోనే ఉంది. యూనియన్లు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు.
ఇదంతా ఎలక్షన్ స్టంట్
ఏడాదిగా ఆర్టీసీని పట్టించుకోలే. ఎన్నికలు రావడంతో ఆర్టీసీ ఉద్యోగులు గుర్తుకొచ్చారు. అవన్నీ రావాల్సిన డబ్బులే. అదనంగా ఏమీ ఇస్తలేరు. ఇన్నాళ్లు పెండింగ్ పెట్టి ఇబ్బంది పెట్టారు. ఇదంతా ఎలక్షన్ స్టంట్. ఉద్యోగులకు అన్నీ తెలుసు. గిమ్మిక్కులు మాని ఆర్టీసీని ఆదుకునే శాశ్వత చర్యలు తీసుకోవాలి.
– హనుమంతు ముదిరాజ్, టీజేఎంయూ, జనరల్ సెక్రటరీ