- ప్రగతి భవన్లో కాంగ్రెస్ లీడర్లు
- సీఎల్పీ లీడర్ భట్టికి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించిన కేసీఆర్
- కాంగ్రెస్ను ఎంకరేజ్ చేసేందుకు మొదటిసారి అపాయింట్మెంట్
హైదరాబాద్, వెలుగు: తొలిసారిగా ప్రగతిభవన్ గేట్లు తెరిచారు. ఇంతకాలం మంత్రులకే అపాయింట్మెంట్ఇవ్వని సీఎం కేసీఆర్.. అనూహ్యంగా కాంగ్రెస్ నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలను కలిసేది లేదని, అసలు ఎంట్రీ లేదని పలుమార్లు తిరస్కరించిన ఆయన.. ఇప్పుడు సడెన్గా వారిని దగ్గరకు తీయటం రాజకీయ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా ఖతం పట్టించారు. ఎన్నికల్లో గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అదే కేసీఆర్ కాంగ్రెస్ నేతలను ఆహ్వానించి, దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్పై చర్చించటం హాట్ టాపిక్గా మారింది. జానారెడ్డి సీఎల్పీ నేతగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం గడిచిన ఏడేండ్లలో దాదాపు ఇరవై సార్లు సీఎం అపాయింట్మెంట్ కోరింది.
ప్రతి సందర్భంలోనూ తిరస్కరించిన కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్ నేతలను పిలిపించుకొని మాట్లాడటం చర్చకు తెరలేపింది. సీఎం స్వయంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి ప్రగతిభవన్కు రావాలని ఆహ్వానించినట్లు తెలిసింది. కొంతకాలంగా రాష్ట్రంలో బీజేపీ స్పీడ్ పెంచింది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలవటంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాకిచ్చింది. హుజూరాబాద్లో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ను పార్టీలో చేర్చుకోవటంతో పాటు హుజూరాబాద్లో ఆయన గెలుపు కోసం ఇప్పట్నుంచే బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది. ఈ టైమ్లో కాంగ్రెస్ను దగ్గరకు తీయడం ద్వారా బీజేపీకి చెక్ పెట్టినట్లు అవుతుందనేది కేసీఆర్ గేమ్ ప్లాన్. అందుకే కాంగ్రెస్ నేతలను రప్పించుకున్నట్లు తెలుస్తోంది. మరియమ్మ లాకప్ డెత్కు సంబంధించి సానుకూల నిర్ణయాలు తీసుకొని.. దళితుల నుంచి వస్తున్న వ్యతిరేకతను చల్లార్చటంతో పాటు రాజకీయంగా కలిసొచ్చేందుకు కాంగ్రెస్ ను కేసీఆర్ ఎంకరేజ్ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. కాంగ్రెస్, టీఆర్ఎస్కు బీ టీమ్గా పని చేస్తోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
వెళ్లారా? పిలిపించుకున్నారా?
సీఎల్పీ నేతలు ప్రగతి భవన్కు అపాయింట్మెంట్ మీద వెళ్లారా? లేదా సీఎం పిలిపించుకున్నారా?.. అనేది చర్చనీయాంశమైంది. ఏడేండ్లలో కాంగ్రెస్ నేతల్ని కలవడానికి ఇష్టపడని కేసీఆర్ ఇప్పుడెలా అవకాశం ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది. సీఎంను కలిసిన సీఎల్పీ బృందంలోని నేత ఒకరు.. తాము మూడ్రోజుల కింద అపాయింట్మెంట్ కోరామని చెప్తున్నారు. గతంలో తమకెప్పుడూ ఆహ్వానం రాలేదని, ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఆశ్చర్యపోయామంటున్నారు. కాంగ్రెస్లోని మరికొందరు నేతలు వేరే కథనం వినిపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్కు సంబంధించి ఆ వర్గ ప్రజాప్రతినిధులతో భేటీ కావాలని భావించిన సీఎం కేసీఆర్ భట్టి విక్రమార్కకు ఎప్పుడు వీలవుతుందో ఆరా తీయాలని సీఎంవో అధికారులను పురమాయించినట్లు సమాచారం. సీఎంవో నుంచి ఫోన్ వెళ్లినప్పుడు భట్టి.. తన నియోజక వర్గంలో దళిత మహిళ మరియమ్మకు జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించి, ఇలాంటి విషయాలు మాట్లాడేందుకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వరని నిలదీసినట్లు తెలిసింది. విషయం సీఎం దృష్టికి తీసుకుపోతామన్న సీఎంవో అధికారులు తర్వాత అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. కేసీఆర్ ఈలోపు సంబంధిత అధికారులతో మాట్లాడి అందరినీ పిలిపించుకున్నట్లు తెలిసింది. భట్టికి అపాయింట్మెంట్ ఖరారు కావడంతో ఆయన అందుబాటులో ఉన్న సభ్యులతో కలిసి ప్రగతి భవన్ వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇన్నేండ్లలో ఎన్ని సార్లు అపాయింట్మెంట్ కోరినా సీఎం స్పందించలేదని, నేరెళ్ల ఘటన మొదలు అనేక అంశాల్లో దళితులపై దాడులు జరిగినప్పుడు సీఎంను కలవాలని ప్రయత్నించామని వాళ్లు గుర్తు చేస్తున్నారు. కొన్ని సంఘటనల్లో సీఎంతోపాటు ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోతే ప్రగతి భవన్ ముట్టడి చేసి అరెస్టయిన సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు. ఏడేండ్లలో ఎప్పుడూ కాంగ్రెస్ను పట్టించుకోని సీఎం ఇప్పుడు ప్రగతిభవన్కు పిలవడం, సీఎల్పీ నేత వెంటనే వెళ్లడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల కోసమే పిలిచిండు
కేసీఆర్కు బీజేపీ భయం పట్టుకున్నది. ఈటల గెలుస్తడనే సమాచారం ఉన్నది. హుజూరాబాద్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నేతలను ప్రగతిభవన్కు పిలిపించిండు. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్కు బుద్ధి చెప్తరు.
‑ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి
టీఆర్ఎస్ బీ టీమ్ కాంగ్రెస్
కాంగ్రెస్ ను తాకట్టు పెట్టేందుకే సీఎల్పీ నేతలు ప్రగతి భవన్కు వెళ్లారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు బీ టీమ్గా కాంగ్రెస్ పని చేయనుంది. కాంగ్రెస్ పార్టీలో సీఎం కేసీఆర్ కోవర్టులు ఉన్నారన్న వీహెచ్ మాటలు ఇప్పుడు నిజమయ్యాయి.
‑ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు