- టీఆర్ఎస్ లీడర్ల ఆరోపణలు సరికాదు: గవర్నర్ తమిళిసై
- ప్రజా సమస్యలను ఎమ్మెల్యేలు వింటే జనం నా దగ్గరకు ఎందుకు వస్తరు?
- గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తిని బీజేపీ మనిషి అని ఎట్ల అంటరు?
- ప్రొటోకాల్ పాటించని ఐపీఎస్, ఐఏఎస్లపై కేంద్రం నిర్ణయం తీసుకుంటదని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: ‘‘తమిళిసై, కేసీఆర్ రావొచ్చు, పోవచ్చూ.. కానీ గవర్నర్ ఆఫీసును, సీఎం ఆఫీసును గౌరవించాలి. అది సర్పంచ్ కార్యాలయం అయినా, రాజ్ భవన్ అయినా ఒక్కటే’’ అని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. నిద్రపోయే వాడిని లేపొచ్చు కానీ, నిద్రపోయినట్లు నటించే వారిని లేపలేమని ప్రొటోకాల్ వివాదంపై ఆమె వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను ఎమ్మెల్యేలు వింటే ప్రజలు తన దగ్గరకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ‘‘నేను ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా? ప్రజలను కలిస్తే తప్పుగా అర్థం చేసుకుంటరా? ఏ పదవిలో ఉన్నా, ప్రజలకు సేవ చేయడం నా లక్ష్యం” అని గవర్నర్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన గవర్నర్ తమిళి సై సోమవారం మీడియాతో ముచ్చటించారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో పలు అంశాలపై స్పందించారు.
సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్న
ఏడాదిలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నానని, తన తల్లి మరణించినప్పుడు మాత్రమే మూడు రోజులు సెలవు తీసుకున్నానని గవర్నర్ తమిళి సై అన్నారు. కావాలంటే తన ట్విట్టర్ అకౌంట్ ను పరిశీలించుకోవచ్చన్నారు. ‘‘నా తలకు రాయి తగిలి రక్తం కారుతున్నా... వెనకకడుగు వేయను, పనిచేయడంలో వెనుదిరగను. నెరవేర్చాల్సిన బాధ్యతలను నెరవేరుస్తా’’ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాజా అంశాలపై ప్రతి నెల కేంద్రానికి గవర్నర్ హోదాలో రిపోర్ట్ అందజేస్తున్నట్లు చెప్పారు.
ఈ రిపోర్ట్ లో అన్ని అంశాలు పొందుపరుస్తామని వివరించారు. ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని వచ్చిన వినతులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఆ ఫైల్ ను సంబంధిత సంస్థకు పంపినట్లు తెలిపారు. ఒక గవర్నర్ గా ఏ అంశంపై తనకు ఫిర్యాదు అందినా... దానిపై విచారణ జరుపుతానని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై గవర్నర్ హోదాలోనే కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చినట్లు చెప్పారు.
భద్రాద్రి టూర్లో భద్రత కూడా కీలకం
ప్రొటోకాల్ విషయంలో ఉగాది, ఉమెన్స్ డే రోజు బహిరంగంగానే మాట్లాడానని గవర్నర్ గుర్తుచేశారు. ఇటీవల రోడ్డు మార్గంలో భద్రాద్రి టూర్ బాగా జరిగిందని, అయితే, ఆ టూర్కూ రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ కల్పించలేదన్నారు. పూర్తిగా నక్సల్ ప్రభావిత ప్రాంతంలో జరిగిన తన టూర్ ప్రొటోకాల్ తో ముడిపడి ఉన్న అంశంకాదని, భద్రతా కూడా కీలకమైందని గవర్నర్ అన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి రేసులో ఉన్నారన్న వార్తలపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. ‘‘ఈ అంశంపై నేను ఏమీ స్పందించను. నేను ఎప్పుడూ ప్రజలకు, దేశానికి ఏమి చేయాలని ఆలోచిస్తూ ఉంటాను’’
అని అన్నారు.
రాజ్భవన్ ఇన్విటేషన్లను రాజకీయ కోణంలో చూడొద్దు
రాజ్ భవన్ ఇన్విటేషన్లను రాజకీయ కోణంలో చూడొద్దని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఉగాది వేడుకలకు సీఎం, మంత్రులు హాజరుకాకపోవడాన్ని మరోసారి ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ తో విభేదించినా, రాజ్ భవన్ను గౌరవిస్తున్నారని తెలిపారు. గవర్నర్గా గుర్తించకోపోయినా, ప్రొటోకాల్ కల్పించకపోయినా.. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రుల జన్మదిన వేడుకలకు గ్రీటింగ్స్ పంపిస్తున్నట్లు చెప్పారు.
బీజేపీ వ్యక్తి అని ఎట్ల అంటరు?
‘‘ప్రజల చేత ఎన్నుకోబడ్డ తామే సుపీరియర్ అని, కేంద్ర ప్రభుత్వం నియమించిందనే కారణంతో గవర్నర్ ఎవరు అన్నట్టు చూడటం సరికాదు” అని గవవర్నర్ తమిళిసై అన్నారు. కేంద్రం గవర్నర్గా ఎవరిని పడితే వారిని నియమించదని చెప్పారు. గవర్నర్ పదవి ఇవ్వడానికి చాలా అర్హతలు చూస్తారని, తాను గొప్ప రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని, ప్రజాసేవలో ముఖ్యమైన డాక్టర్ వృత్తిలో సేవలందించానని, ఇప్పుడు రాజ్యాంగ బద్ధ హోదాలో పని చేస్తున్నానని తెలిపారు. ‘‘గతంలో నేను బీజేపీలో పని చేసిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు రాజ్యాంగ బద్ధమైన గవర్నర్ హోదాలో ఉన్నాను.
వారు మాత్రం నిన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తిని టీఆర్ఎస్ లోకి తీసుకొని ఎమ్మెల్సీ ఇవ్వొచ్చు..మరి అప్పుడు ఆయన కాంగ్రెస్ ఏజెంట్ కాదా...? అలాంటప్పుడు గవర్నర్ను బీజేపీ వ్యక్తి అని ఎలా దూషిస్తారు” అని ఆమె ప్రశ్నించారు. ఒక వ్యక్తిని కానీ, ఒక కార్యాలయాన్ని కానీ అవమానించడం ఆరోగ్యకరమైన అంశం కాదన్నారు. పోరు అనేది విపక్షాలతో ఉండాలని కానీ, గవర్నర్తో కాదన్నారు. కేంద్రంతో సరైన సంబంధాలు లేవని చెప్పి గవర్నర్ను కేంద్రం మనిషిగా భావిస్తే తానేమీ చేయలేనన్నారు. అయినా, ఇదో పెద్ద అంశమని తాను భావించడం లేదని చెప్పారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరగడాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అని అన్నారు.