నిధుల్లో కేంద్ర, రాష్ట్ర వాటాలపై చర్చకు సిద్ధం

నిధుల్లో కేంద్ర, రాష్ట్ర వాటాలపై చర్చకు సిద్ధం
  • అవినీతికి తెలంగాణ సెంటిమెంట్ ముడిపెట్టి లబ్ది పొందాలని చూస్తున్నారు
  • సూర్యాపేట జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

సూర్యాపేట జిల్లా : రాష్ట్ర అభివృద్ధి నిధులలో కేంద్ర రాష్ట్ర వాటాలపై చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పంజాబ్ రైతు పోరాట మృతులకు పరిహారమిస్తున్న కేసీఆర్ తెలంగాణా ఉద్యమ త్యాగధనులకు ఏం చేశారు అని ఆయన ప్రశ్నించారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు,  బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితిపై చేస్తున్న సర్వేల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రిపోర్టులు వస్తున్నాయని.. అందుకే సీఎం కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులు.. టీఆర్ఎస్ నాయకుల్లో అభద్రతాభావంతో ఉన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు మాఫియాగా మారి ప్రజలను వేధిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించేవారి పై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సర్వేలన్నీ వ్యతిరేకంగా మారడంతో కేసీఆర్ అభద్రతాభావంలో ఉన్నాడని, అవినీతికి తెలంగాణా సెంటిమెంట్ కి ముడిపెట్టి టీఆర్ఎస్ లబ్ది పొందాలని చూస్తోందన్నారు. 
అన్నీ టీఆర్ఎస్ వారి కనుసైగల్లోనే..
రైతు బంధు నుంచి దళిత బంధు వరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు.. టీఆర్ఎస్ నాయకుల కనుసైగల్లో. . వారి అకౌంట్లలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ఎవరైనా మాట్లాడితే.. గల్లీ నుంచి ప్రగతి భవన్ వరకు విమర్శల దాడులుచేస్తూ.. పరుష పదజాలం వాడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్లు అన్ పార్లమెంటరీ భాష వాడుతున్నారని అన్నారు. ‘తెలంగాణ కోసం పోరాటం చేసింది ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే కాదు.. వందల మంది విద్యార్థులు బలిదానం చేస్తే.. సకల జనులు సమ్మె చేస్తే తెలంగాణ వచ్చింది.. జేఏసీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు పోరాడితే.. పార్లమెంటులో బీజేపీ ఒత్తిడితోనే తెలంగాణ సాకారం అయింది..’’ అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రజాకంటక పాలన పై బీజేపీ ఉద్యమాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం బీజేపీ తోనే సాధ్యమన్నారు. కేసీఆర్ నిరంకుశ కుటుంబ పాలనపై రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

ప్రేమోన్మాది దాడి ఘటనపై స్పందించిన గవర్నర్

మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు

ఒక్క నిమిషం లేటైతే అనుమతించరు.. మరీ మీరు కావొచ్చా..?