ములుగులో కాంగ్రెస్ కార్యకర్తలకే దళితబంధు!

ములుగులో కాంగ్రెస్ కార్యకర్తలకే దళితబంధు!
  • ములుగు టీఆర్ఎస్​ లీడర్ల ఆగ్రహం  
  • రాజీనామా చేస్తామంటూ హెచ్చరిక

వెంకటాపురం, వెలుగు: ఎమ్మెల్యే సీతక్క తన అనుచరులైన కాంగ్రెస్ కార్యకర్తలకు దళితబంధు ప్రోసిడింగ్ ఇప్పించడంపై ములుగు జిల్లా రూలింగ్ పార్టీ నేతలు గుర్రుమీదున్నారు. శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు రహస్య సమావేశం నిర్వహించారు. జిల్లా పాలనా యంత్రాంగం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏండ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలకు కాకుండా కాంగ్రెస్ వారికి దళితబంధు ఫైనల్ ప్రోసిడింగ్ ఆర్డర్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా దళితబంధు ఇప్పించడంలో ఎమ్మెల్యే సీతక్క ప్రభావం చూపించారని, దీంతో క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్​బలహీనపడే ప్రమాదం ఉందని అన్నారు. దళితబంధు ప్రోసిడింగ్స్ ఆపకుంటే పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్లారు. రాజీనామాకు రెడీ అయిన వారిలో 8 మండలాల పార్టీ అధ్యక్షులు, నలుగురు జడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీటీసీలు, ఇతర లీడర్లు ఉన్నారు.