మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు

మునుగోడులో గడ్డపై టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది.కారు పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,341 ఓట్ల తేడాతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి నెక్ టు నెట్ ఫైట్ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నడిచింది. రౌండ్ రౌండ్ కు నువ్వా..నేనా అన్నట్టు పోరు సాగింది. దాదాపు 10 రౌండ్ల వరకు స్వల్ప మెజార్టీతో కనిపించిన కారు పార్టీ..11వ రౌండ్ నుంచి స్పష్టమైన మెజార్టీ ప్రదర్శించింది. రెండు, మూడు, 15వ రౌండ్లలో మాత్రమే కమలం పార్టీ ముందంజలో నిలిచింది. మిగతా అన్ని రౌండ్లలో కారు దూసుకుపోయింది. ఫలితంగా బైపోల్ లో అధికార పార్టీ విక్టరీ కొట్టింది. బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. 

బైపోల్ లో 2లక్షల 25వేల 192 ఓట్లు పోలయ్యాయి. వీటిలో ప్రతిపక్షాలన్నింటికి లక్షా 28వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. వీటిలో బీజేపీకి 86వేల 485 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ తప్ప మిగితా పార్టీలన్నింటికి కలిపి 42వేల 109 ఓట్లు పోలయ్యాయి. కూసుకుంట్లకు 42.89 శాతం ఓట్లు పోలయ్యాయి. గతంకంటే 4 శాతం ఎక్కువ ఓట్లు సాధించారు కూసుకుంట్లు. మరోవైపు గతంలో 49 శాతం ఓట్లు సాధించిన రాజగోపాల్ 38 శాతం ఓట్లు దక్కించుకున్నారు.

మునుగోడు బై పోల్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతైంది. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 22 వేల 449 ఓట్లను మాత్రమే సాధించారు.  కనీసం పోటీ ఇవ్వలేక హస్తం పార్టీ చతికిల పడింది. కనీసం థర్డ్ ప్లేస్ అయినా వస్తుందని అనుకున్నా..డిపాజిట్ కోల్పోవడం కార్యకర్తల్లో తీవ్ర నిరాశ నెలకొంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నించినా ..పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే సాగింది. కమ్యునిస్టులు టీఆర్ఎస్ తో కలిసి రావడం బాగా కలిసి వచ్చింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో ఆ పార్టీ అగ్రనేతలు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. 

మునుగోడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతున్నా..హస్తం పార్టీకి మైలేజ్ తీసుకురాలేకపోయాయి. మరోవైపు కాంగ్రెస్ లో కలహాలు, కుమ్ములాటలు తీవ్రంగా ప్రభావం చూపించాయి. ఆశించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోవడంపై రెండు రౌండ్ల ఫలితాలు వెలువడగానే పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు బై పోల్ ప్రచారంలో పాల్గొనకపోవడం, పాల్వాయి స్రవంతికి మద్దతు ప్రకటించకపోవడం కాంగ్రెస్ పాలిట ప్రతికూల అంశంగా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా మునుగోడులో ప్రచారం చేసినా ఓటర్లను ఆకర్షించడంలో సక్సెస్ కాలేకపోయారు.