హైదరాబాద్: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జులై 2న టీఆర్ఎస్ సభ నిర్వహించనుంది. విపక్షాల మద్దతు కూడగట్టేందుకు జులై 2న యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. యశ్వంత్ సిన్హాకు స్వాగత ఏర్పాట్లు, అనంతరం జరిగే సభ పై జలవిహార్ లో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మేయర్ విజయలక్ష్మి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జులై రెండో తేదీన ఉదయం 10 గంటలకు యశ్వంత్ సిన్హా బేగంపేటకు చేరుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హాకు ఘనంగా స్వాగతం పలకనున్నట్లు స్పష్టం చేశారు. బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి జలవిహార్ వరకు 10 వేల బైకులతో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు చెప్పారు. అనంతరం ఉదయం 11 గంటలకు జల విహార్ లో సభ ఉంటుందని పేర్కొన్నారు. కాగా జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.
