మిత్రదేశంపైన ట్రంప్ నిప్పులు చెరగటం సంచలనంగా మారింది. ఇన్నాళ్లు ఇరాన్ పై యుద్ధానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహాయం తీసుకున్న అమెరికా.. ఇప్పుడు ఒమన్ కు వార్నింగ్ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. ఒమన్ పద్ధితిగా ప్రవర్తించకుంటే ఏకంగా పేల్చేస్తామని యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు.
హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం విషయంలో ఇరాన్కు మద్దతు ఇస్తే, మిత్రదేశమని కూడా చూడం.. ఒమన్పై దాడి చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం (మే 27) పరోక్షంగా హెచ్చరించారు .
హార్మూజ్ జలసంధిపై ఇరాన్ కు నియంత్రణాధికారం కల్పించే స్వల్పకాలిక ఒప్పందాన్ని ఒమన్ అంగీకరిస్తే ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు, ఒమన్ మర్యాదగా ప్రవర్తించాలి.. లేదంటే పేల్చివేస్తానని ట్రంప్ అన్నారు.
అవి అంతర్జాతీయ జలాలు, ఒమన్ కూడా అందరిలాగే ప్రవర్తిస్తుంది, లేకపోతే మనం వారిని పేల్చివేయాల్సి వస్తుంది. వారికి ఆ విషయం అర్థమై ఉంటుంది, క్షేమంగానే ఉంటారు అని అన్నారు. ట్రంప్ పొరపాటున అలా మాట్లాడారా, ఒమన్ కు బదులుగా ఇరాన్ను ఉద్దేశించి అలా మాట్లాడారా? అని ఏఎఫ్పీ ప్రశ్నించగా, వైట్ హౌస్ వెంటనే స్పందించలేదు.
సాధారణంగా ప్రపంచ చమురులో ఐదవ వంతు హోర్ముజ్ జలసంధి నుంచే రవాణా జరుగుతోంది. అక్కడి నుంచి ప్రయాణించే ఓడలపై టోల్ విధించి, వచ్చిన ఆదాయాన్ని ఒమన్తో పంచుకోవాలనే ప్రతిపాదనను ఇరాన్ చేసింది.
మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని ముగించి, జలసంధిని తిరిగి తెరవడానికి తీవ్రంగా ప్రయత్నించిన ట్రంప్.. ఒప్పందం దగ్గరలో ఉందని చెప్పిన కొద్ది రోజులకే మరోసారి డీల్ నిలిచిపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు.
