ట్రంప్ వ్యూహం ఫలించిందా?.. ఉక్రెయిన్పై యుద్ధం ఆపాలని రష్యా ఆయిల్ కంపెనీలపై ట్రంప్ విధించిన ఆంక్షలు ఫలితాలిచ్చాయా? రష్యానుంచి వివిధ దేశాల అయిల్ కొనుగోళ్లు తగ్గడంతో నిజమే అనిపిస్తోంది. భారత దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) రష్యాకంపెనీల నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేసి యూఎస్, యూరప్ దేశాలనుంచి భారీ ఎత్తున ఆయిల్ కొనుగోలు చేస్తోంది. తాజా రిపోర్టుల ప్రకారం.. అమెరికా, యూరప్ దేశాల నుంచి మిలియన్ల బ్యారెళ్ల ఆయిల్ ను కొనుగోలు చేసింది రిల్.
సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ వంటి మధ్యప్రాచ్య దేశాలతో పాటు అమెరికా షేల్ ఆయిల్ మార్కెట్ నుంచి కూడా రిలయన్స్ భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తోంది. దీంతో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు పెద్ద ఎత్తున తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ చమురు మార్కెట్లో పెరుగుతున్న సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని రిలయన్స్ తన సరఫరా మార్గాలను విస్తరించడం ద్వారా రిఫైనరీ స్థిరత్వాన్ని కాపాడుకుంటోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఇటీవల రష్యాకు నిధులు సమకూర్చే రెండు పెద్ద నూనె కంపెనీలు - రోస్నెఫ్ట్ ,లుకాయిల్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించారు. ఇది ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనే ట్రంప్ ఒత్తిడి భాగంగా కనిపిస్తోంది. ఈ ఆంక్షలు అమలులోకి వచ్చిన తర్వాత భారత్ లోని అతిపెద్ద రష్యన్ నూనె దిగుమతిదారు అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) రష్యన్ సరఫరాలను తగ్గించి, యూరప్,అమెరికా నుంచి మిలియన్ల బ్యారెళ్ల ముడి నూనెను కొనుగోలు చేస్తోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గుజరాత్లోని జమ్నాగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ కంపెనీ. ఇది రోజుకు 1.4 మిలియన్ బ్యారెళ్ల సామర్థ్యం కలిగి ఉంది.యూరోపియన్ యూనియన్ కూడా జనవరి 2026 నుంచి రష్యన్ క్రూడ్ నుంచి తయారైన ఇంధనాలపై నిషేధం విధించనుంది. ఇది భారత రిఫైనరీలపై మరింత ఒత్తిడి పెంచనుంది. ఈ క్రమంలోనే ముందస్తు జాగ్రత్తలో భాగంగా రిల్ పెద్ద మొత్తంలో యూఎస్, యూరప్ దేశాలనుంచి ఆయిల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
