ఇరాన్‌పై అమెరికా నెక్స్ట్ స్టెప్.. రంగంలోకి శక్తివంతమైన USS ట్రిపోలి

 ఇరాన్‌పై అమెరికా నెక్స్ట్ స్టెప్.. రంగంలోకి శక్తివంతమైన USS ట్రిపోలి

అమెరికా,  ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సైన్యం దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న క్రమంలో ఇరాన్ తన మాట వినడం లేదని పూర్తి స్థాయి సైనిక చర్యకు దిగుతామని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాన్ పై ముప్పేట దాడి చేస్తామని ట్రంప్ ఫైనల్  హెచ్చరికలు చేసిన కొద్ది రోజులకే పశ్చిమాసియా సైనికపరంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగారక్షణ రంగంలో అతి శక్తివంతమైన USS ట్రిపోలీని  అమెరికా  రంగంలో దించుతోంది. 

గత వారం రోజులుగా ఇరాన్ భూభాగంలోకి అమెరికా సైన్యాన్ని పంపే అవకాశం ఉందంటూ అధ్యక్షుడు ట్రంప్ అనేక సంకేతాలిచ్చారు. ఇది కేవలం కొన్ని రోజుల్లోనే జరగవచ్చని  ప్రకటించారు. ఇందులో భాగంగా హిందూ మహాసముద్రం గుండా వేగంగా ప్రయాణిస్తున్న USS ట్రిపోలి అనే యుద్ధనౌక ఇరాన్ వైపు దూసుకొస్తున్న శాటిలైట్ దృశ్యాలు  కనిపిస్తున్నాయి. నిజంగానే ఇరాన్‌పై పూర్తిస్థాయిలో అమెరికా యుద్దానికి దిగుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

USS ట్రిపోలి రాక: అమెరికా మీడియా సంస్థలురిలీజ్ చేసిన మార్చి 15 నాటి శాటిలైట్ దృశ్యాల ప్రకారం.. ట్రంప్ ప్రకటనలను అనుగుణంగానే  యూఎస్ఎస్ ట్రిపోలి రెండు రక్షక నౌకలతో కలిసి దక్షిణ చైనా సముద్రం మీదుగా నైరుతి దిశగా ప్రయాణిస్తోంది.  దాదాపు 2వేల మంది మెరైన్ సైనికులతో వస్తున్న ఈ యుద్ధనౌక మార్చి 22-23 నాటికి అరేబియా సముద్రానికి చేరుకోవచ్చని అమెరికన్ మీడియా  వెల్లడించింది. ఇది కేవలం విమాన వాహక నౌక మాత్రమే కాదు, తీరం వెంబడి సైన్యాన్ని దించి దాడులు చేయగల అత్యాధునిక నౌక అని పేర్కొంది. నివేదికల ప్రకారం 40వేలనుంచి  50వేల  మంది అమెరికా సైనికులు ఇప్పటికే ఇరాన్ ను చుట్టుముట్టాయని అంచనా. ట్రిపోలి నౌకలోని మెరైన్ యూనిట్ త్వరలో ఇరాన్ సరిహద్దులకు చేరుకునేందుకు  సైనిక విశ్లేషకులు సూచిస్తున్నారు.

ట్రంప్ ఈ విషయంలో భిన్నమైన సంకేతాలిస్తున్నారు. ఓవైపు నేను సైన్యాన్ని ఎక్కడికీ పంపడం లేదు అని చెబుతూనే, మరోవైపు  ఒకవేళ పంపాల్సి వస్తే ఆ విషయాన్ని మీకు ముందుగా చెప్పను  ద్వంద్వరీతిలో అని వ్యాఖ్యానించారు. గతంలో ఆయన  నేను సైన్యాన్ని పంపడానికి భయపడను అని కూడా ప్రకటన చేశారు. 

రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికా నేరుగా ఇరాన్ ప్రధాన భూభాగంపై దాడి చేయడం కంటే, హోర్ముజ్ జలసంధిని తెరిపించడానికి , ఇరాన్ చమురు కేంద్రమైన ఖార్గ్ ద్వీపాన్ని (Kharg Island) తన ఆధీనంలోకి తీసుకోవడానికి ఈ మెరైన్ సైన్యాన్ని ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉంది. 

USS ట్రిపోలి గురించి

ఇది ఒక విమాన వాహక నౌకను పోలి ఉన్నప్పటికీ, యూఎస్ఎస్ ట్రిపోలి (LHA-7) అనేది భూతర, సముద్ర జలాల్లో దాడికి అనువైన నౌక. ఇది F-35 ఫైటర్ జెట్‌లు, MV-22 ఆస్ప్రే టిల్ట్ రోటర్ విమానాలు ,MH-60S సీహాక్ హెలికాప్టర్లతో సహా డజన్ల కొద్దీ విమానాలను మోయగలదు. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌక అయిన గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ 1,106 అడుగుల పొడవు ఉండగా, ఈ నౌక పొడవు సుమారు 844 అడుగులు ఉంటుంది. 

ఈ నౌక ఓ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్‌ను మోసుకెళ్తోంది. ఇది సుమారు 2వేల200 మంది మెరైన్లు, నావికులతో కూడిన యాక్షన్ ఫోర్స్. ఇటువంటి యూనిట్లు మొబైల్ బేస్‌లుగా పనిచేసే నౌకల నుంచి పనిచేస్తాయి. కమాండ్ విభాగం ప్రధాన కార్యాలయంగా పనిచేస్తూ, యూనిట్‌లో భూతల, విమానయాన, సముద్ర జలాల దాడులు చేయగల సైనిక సామర్థ్యం ఉంటుంది.