- ఏఐ అప్లికేషన్ ‘మిడ్జర్నీ’తో అద్భుతాలు
- డిజిటల్ ఆర్టిస్ట్ ముల్లూర్ సృష్టించిన ప్రముఖుల ఫొటోలు వైరల్
దుబాయ్: ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్(ఏఐ) విచిత్రాలు నెటిజన్లను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్నాయి. దుబాయ్కు చెందిన డిజిటల్ఆర్టిస్ట్ జ్యో జాన్ ముల్లూర్ ఏఐ టెక్నాలజీతో ప్రపంచ ప్రముఖుల చిన్ననాటి ఫొటోలను రూపొందించాడు. ముల్లూర్ సృష్టించిన డొనాల్డ్ ట్రంప్, మస్క్, ముఖేశ్అంబానీ వంటి ప్రముఖులు బాల్యంలో ఏవిధంగా ఉండేవారో తెలిపే కొత్త ఫొటోలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. "చిన్న కలలు కనేవారి నుంచి పెద్ద సాధకుల వరకు.. ఈ చిన్ననాటి ఫొటోలు నేటి కోటీశ్వరుల నిరాడంబర ప్రారంభాన్ని తెలియజేస్తున్నాయి. ప్రతి విజయగాథ వెనుక ఓ సంకల్పం, ఆశయం, ప్రయాణం ఉంటుంది’’ అని ముల్లూర్ పోస్ట్కు క్యాప్షన్ రాశాడు.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా, ముల్లూర్ మొదటి పోస్ట్లో డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, జుకర్బర్గ్, జాక్ మా, ముఖేష్ అంబానీ, రిచర్డ్ బ్రాన్సన్, జెఫ్ బెజోస్, సుందర్ పిచాయ్, స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్ల ఏఐ చిత్రాలు పోస్ట్ చేశాడు. ఈక్రమంలో రెండవ ఇన్స్టా పోస్ట్ లో వ్లాదిమిర్ పుతిన్, బిల్ గేట్స్, కిమ్ జోంగ్ ఉన్, బైడెన్, నరేంద్ర మోడీ, బరాక్ ఒబామా, ఓప్రా విన్ఫ్రే,సెర్గీ బ్రిన్లతో సహా ప్రసిద్ధ వ్యక్తుల ఫొటోలను రివీల్ చేశాడు. రెండు ఇన్స్టా పోస్ట్లకు గంటల వ్యవధిలో లక్షలాది షేర్లు, వేల సంఖ్యలో లైక్లు వచ్చాయి. చాలా మంది యూజర్లు ప్రత్యేక ఫొటోలను చూసి ఆర్ట్వర్క్పై సంతోషం, విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘మిడ్జర్నీ’ అనే ఏఐ అప్లికేషన్ను ఉపయోగించి తాను ఫొటోలను రూపొందించానని ముల్లూర్ వెల్లడించారు. గతంలో ముల్లూర్ ప్రపంచ నాయకులను "రాక్స్టార్స్"గా చూపుతూ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. "వరల్డ్ లీడర్షిప్ మ్యూజిక్ కాన్సర్ట్"లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్,అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, జర్మనీ మాజీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్లను మ్యూజిక్ లెజెండ్స్గా రూపొందించి ఫొటోలు పోస్ట్ చేయగా ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్నాయి.