అధికార పీఠం కోసం ట్రంప్ ‘జాతివిద్వేష’ అస్త్రం

అధికార పీఠం కోసం ట్రంప్ ‘జాతివిద్వేష’ అస్త్రం

న్యూయార్క్: అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​మరోసారి అధికార పీఠంపై కన్నేశారు. రెండోసారీ ప్రెసిడెంట్​ పదవిని కైవసం చేసుకునేందుకు తన అమ్ములపొదిలోని ‘జాతి విద్వేష’ అస్త్రానికి మెల్లగా పదును పెడుతున్నారు.  ‘‘అమెరికాకు వలస వచ్చిన వారిపై సీరియస్​ కామెంట్స్​ చేయడం, తద్వారా దేశంలోని తెల్లజాతి ప్రజల్లో దేశభక్తి సెంటిమెంట్ రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం..” 2017లో మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా గెలిచినప్పుడు ట్రంప్​ అనుసరించిన ప్రధాన వ్యూహమిది. ఇప్పుడు 2020 నవంబరులో రానున్న అధ్యక్ష ఎన్నికలకు కూడా ట్రంప్​ ఇదే వ్యూహాన్ని  ప్రయోగిస్తున్నారు.

ఈమధ్యనే ఆయన నలుగురు డెమొక్రాట్​ మహిళా సెనెటర్లు.. అలెగ్జాండ్రియా ఒకాసియో–కార్టెజ్, ఇల్హాన్​ ఒమర్, అయానా ప్రిస్లీ, రషీదా తాలిబ్​లు వారి దేశాలకు వెళ్లిపోవాలంటూ ట్రంప్​  చేసిన జాతి విద్వేష వ్యాఖ్యలు, ట్వీట్లు ఈ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. నార్త్​ కరోలినాలో ఓ ర్యాలీ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్​ చేయగా.. ర్యాలీకి వచ్చిన జనంలోంచి చాలామంది కూడా ‘వెనక్కి పంపండి’ అంటూ  వంతపాడారు. ​ వలసవాదులు, మైనారిటీలను బూచీలుగా చూపడం, దేశంలోని తెల్లజాతి ప్రజల్లో అసంతృప్తులతో సహా మెజారిటీ జనాన్ని  తన వైపు తిప్పుకోవడంలో ఈసారి కూడా విజయం సాధిస్తానని ట్రంప్​ధీమాగా ఉన్నారు. అందుకే.. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, మీడియా, అంతర్జాతీయ సమాజం తప్పుపట్టినా సరే.. ట్రంప్​ ఇదే అస్త్రాన్ని మరోసారి ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ‘

‘ట్రంప్​ అమెరికా జెండా కోసం నిలబడతారు. సరిహద్దులను బార్లా తెరవడానికి వ్యతిరేకం. దేశభక్తి ఎల్లప్పుడూ గెలుస్తుంది’’ అని ఆయన​ అధికార ప్రతినిధి కెల్లీ సాడ్లర్​ వ్యాఖ్యానించడం దీనిని తేటతెల్లం చేస్తోంది.  ట్రంప్​ వ్యూహం దురదృష్టకరం అయినప్పటికీ, ఆయన స్మార్ట్​ పాలిటిక్స్​ చేస్తున్నారని, క్రమంగా ఎన్నికల వేడి రాజుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు.