హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ పక్క సీటులోని వ్యక్తి చనిపోయినా అతని ఫ్యామిలీకి బీమా పరిహారం పూర్తిగా ఇవ్వాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. 2013లో మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కారు రోడ్డు పక్కనున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న సుబ్బారావు అనే వ్యక్తి మరణించారు. చనిపోయిన వ్యక్తికి న్యూఇండియా అస్సూరెన్స్ కంపెనీలో బీమా ఉంది. ఆ కంపెనీ నుంచి అతని ఫ్యామిలీకి పరిహారం రావాల్సి ఉంది.
అయితే, సుబ్బారావు మృతికి డ్రైవర్ నిర్లక్ష్యం కారణమైనందునా బీమా మొత్తం రూ. 29 లక్షల్లో సగమే బాధిత కుటుంబానికి పరిహారంగా అందించాలని మోటారు ప్రమాదాల వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను మృతుడి భార్య హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ పి.శ్యాంకోశీ, జస్టిస్ ఎన్. తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది.
డ్రైవర్ పక్క సీటులో ఉన్న వ్యక్తి ప్రమాదానికి ఎలా బాధ్యత వహిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. పరిహారం తగ్గింపు సరికాదంటూ ట్రైబ్యునల్ ఉత్తర్వులను సవరించింది. మొత్తం పరిహారాన్ని 2013 నుంచి వడ్డీతో కలిపి చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.