హైదరాబాద్, వెలుగు: గృహలక్ష్మి పథకం అమలును షెడ్యూల్ ప్రాంతాల్లో తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సొంత జాగా ఉండి ఇల్లు లేని నిరుపేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబర్ 25 జారీ చేసింది.
ఈ జీవో ప్రకారం సొంత జాగా ఉన్న వాళ్లకి ఇండ్ల నిర్మాణం కోసం రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. అయితే, గిరిజన ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా నిర్వహించాలని, కానీ.. ప్రభుత్వం అలా చేయకుండా జాగా ఉన్న వాళ్లందరికీ గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదని ఆదివాసీ సేన ప్రధాన కార్యదర్శి సాయిబాబు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి విచారణ చేపట్టారు. వాదనలు విన్న జడ్జి.. ఆ ప్రాంతాల్లో పథకం అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే, ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజనాభివృద్ధి, ఆర్అండ్బీ శాఖల కార్యదర్శులు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ, గిరిజనాభివృద్ధి శాఖ కమిషనర్, ములుగు, కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, నాగర్కర్నూల్ జిల్లాల కలెక్టర్లు, ప్రాజెక్టు ఆఫీసర్లకు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 16న జరిగే విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.