అర్రాస్​కు మరో 20 ఎకరాలు...అమ్మకానికి 3 జిల్లాల్లోని రూ.581 కోట్ల స్థలం

అర్రాస్​కు మరో 20 ఎకరాలు...అమ్మకానికి 3 జిల్లాల్లోని రూ.581 కోట్ల స్థలం
  • బహిరంగ ప్రకటన విడుదల చేసిన హెచ్ఎండీఏ
  • వచ్చే నెల 19 వరకు రిజిస్ట్రేషన్లు.. 22న రెండు సెషన్లలో వేలం
  • కోకాపేటలోని భూమికి ఎకరా ధర రూ.53.24 కోట్లుగా ఫిక్స్
  • బీఆర్ఎస్‌‌కు మాత్రం రూ.3.41 కోట్లకే ఇచ్చేసిన హెచ్ఎండీఏ!

హైదరాబాద్, వెలుగు: ఆమ్దానీ కోసం రాష్ట్ర సర్కార్ భూముల అమ్మకాన్ని కొనసాగిస్తున్నది. వరుసపెట్టి అర్రాస్‌‌లు పిలుస్తున్నది. రెండు మూడేండ్లుగా ప్రభుత్వ భూముల్ని రియల్​ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేస్తున్నది. తాజాగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 20.732 ఎకరాల భూముల వేలానికి హెచ్ఎండీఏ బహిరంగ ప్రకటన రిలీజ్ చేసింది. వివిధ ప్రాంతాల్లో గజాల లెక్కన వాటిని ఈ–వేలం ద్వారా అమ్మేయనున్నట్టు పేర్కొంది. 302 గజాల ప్లాట్ల నుంచి అత్యధికంగా 8,591 చదరపు గజాల ప్లాట్ల దాకా 34 బిట్లను అమ్మకానికి పెట్టింది. మొత్తంగా 1,00,342 చదరపు గజాల జాగాను వేలం వేసేందుకు బిడ్లను ఆహ్వానించింది. అందులో అత్యంత ఖరీదైన కోకాపేట, నల్లగండ్ల, గోపన్​పల్లి, చందానగర్ తదితర ప్రాంతాల్లోని భూములు కూడా ఉన్నాయి. నల్లగండ్లలో అత్యధికంగా ఒక్క చదరపు గజానికి రూ.లక్షన్నర ఫిక్స్ చేయగా.. కోకాపేటలో రూ.1.10 లక్షలు, చందానగర్‌‌‌‌లో రూ.లక్షగా మినిమమ్ ధరను నిర్ణయించారు. 

హెచ్ఎండీఏ నిర్ధారించిన ధర ప్రకారం ఆ మొత్తం స్థలాల విలువ రూ.581.54 కోట్లు. ఒక్కో చదరపు గజంపై ఫిక్స్ చేసిన ధరపై కనీసం రూ.వెయ్యి లేదా అంతకన్నా ఎక్కువకు కోట్ చేసేలా బిడ్లను సమర్పించాలని హెచ్ఎండీఏ ప్రకటనలో సూచించింది.

రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1,180

భూముల అర్రాస్‌ను సర్కారు వచ్చే నెలలో నిర్వహించనుంది. జూన్ 19 వరకు బిడ్ల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. అదే నెల 22వ తేదీన రెండు సెషన్లలో ఆన్​లైన్​లో వేలం ప్రక్రియను నిర్వహించనుంది. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు రంగారెడ్డి జిల్లాలోని 16 బిట్లు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మల్కాజిగిరిలోని 8 బిట్లు, సంగారెడ్డిలోని 10 బిట్లకు ఈ–వేలాన్ని నిర్వహించనుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1,180, ఒక్కో ప్లాటుకు రూ.5 లక్షల ఈఎండీని ఫీజుగా నిర్ణయించింది. 6, 7, 8వ తేదీల్లో ప్రీ బిడ్​ సమావేశాలను అధికారులు నిర్వహించనున్నారు.

వేలంలో పోకుంటే డబుల్ బెడ్రూం ఇండ్లు కడ్తరట

ఇప్పటిదాకా జరిగిన భూముల వేలానికి రియల్టర్ల నుంచి భారీగానే స్పందన వచ్చింది. అయితే ప్రస్తుత వేలానికి సంబంధించి ఎవరూ బిడ్ వేయకపోతే ఆ సైట్లలో డబుల్ బెడ్రూం ఇండ్లు కడతామని లేదా కమ్యూనిటీ హాల్స్, ఇతర సామాజిక వసతుల నిర్మాణానికి వినియోగిస్తామని హెచ్ఎండీఏ ‘గమనిక’ను కూడా పెట్టింది. వాస్తవానికి డబుల్​ బెడ్రూం ఇండ్ల కోసం జనాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. హెచ్​ఎండీఏ గమనిక నేపథ్యంలోనే అర్రాస్ వేసే బదులు పేదలకు ఆయా ప్రాంతాల్లోనే డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించొచ్చు కదా అన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. బిడ్లు రాకుంటే కట్టిస్తామనడం కన్నా.. బిడ్లు పిలవకుండానే ఆ జాగాల్లో పేదలకు మంచి జరిగేలా ఇండ్లు కట్టిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రాంతాల్లోని బిట్లకే వేలం

రంగారెడ్డి జిల్లా: గండిపేటలోని బైరాగి గూడ, మంచిరేవుల, పీరం చెరువు, కోకాపేట, రాజేంద్రనగర్‌‌లోని మైలార్​దేవ్ పల్లి, బుద్వేల్, శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్ల, గోపన్​పల్లి, చందానగర్, బాలాపూర్ పరిధిలోని మల్లాపూర్, సరూర్​నగర్​లోని లింగోజిగూడ, కందుకూర్​లలో 65,705 చదరపు గజాల బిట్లకు హెచ్‌ఎండీఏ అర్రాస్ వేయనుంది. ఈ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ నిర్ధారించిన ధర ప్రకారం అర్రాస్ వేయనున్న మొత్తం భూమి విలువ రూ.481.10 కోట్లు. అంటే మొత్తం వేలంలో ఇక్కడి భూముల విలువే 82.7 శాతం కావడం గమనార్హం. 

మల్కాజిగిరి జిల్లా: మేడిపల్లిలోని చెంగిచర్ల, దుండిగల్ పరిధిలోని బౌరంపేట, కుత్బుల్లాపూర్​లోని సూరారం, బాచుపల్లిల్లో 13,310 చదరపు గజాల భూములకు వేలం వేయనున్నారు. వాటి మొత్తం విలువ సుమారు రూ.38.88 కోట్లు.

సంగారెడ్డి జిల్లా:  అమీన్​పూర్, కిష్టారెడ్డిపేట్, ఆర్​సీ పురంలోని వెలిమల, పటాన్​చెరులోని రామేశ్వరం బండ, నందిగామ, పతిఘనపూర్​లలో 21,296 చదరపు గజాల బిట్లకు వేలం నిర్వహించనున్నారు. వాటి మొత్తం విలువ రూ.61.55 కోట్లు. 

గతంలోనూ అర్రాస్​

భూముల వేలం ద్వారా ఆమ్దానీని సమకూర్చుకోవడం రాష్ట్ర సర్కారుకు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ భూములను వేలం వేసి వేల కోట్ల రూపాయలను ఖజానాలో జమ చేసుకుంది. కోకాపేట్, ఖానామెట్, ఉప్పల్ భగాయత్, పుప్పాలగూడ, రాజేంద్రనగర్ సహా వివిధ జిల్లాల్లోనూ సర్కార్ భూములను అర్రాస్ పెట్టింది. 2022లో సర్కారుకు రూ.12 వేల కోట్ల ఆమ్దానీ భూములను అమ్మడం ద్వారానే వచ్చింది. 2021లో కోకాపేట్​లోని 50 ఎకరాలను వేలం వేయడం ద్వారా రూ.2 వేల కోట్లు, ఖానామెట్​లోని 14.9 ఎకరాలను వేలం వేస్తే రూ.729.41 కోట్లు, ఉప్పల్ భగాయత్​భూముల వేలం ద్వారా రూ.474 కోట్ల మేర సర్కారుకు ఆదాయం వచ్చింది.

బీఆర్ఎస్‌కు అగ్గువ

కోకాపేట్‌లోని 11 ఎకరాల భూమిని రెండు రోజుల కిందట బీఆర్‌‌ఎస్‌కు ప్రభుత్వం ఇచ్చింది. ఎకరాకు కేవలం రూ.3,41,25,000కే ఇచ్చేసింది. ఇలా మొత్తంగా 11 ఎకరాల భూమిని అగ్గువకు  రూ.37,53,75,000కు హెచ్ఎండీఏ ఇచ్చేసింది. మరోవైపు తాజా అర్రాస్ ప్రకారం కోకాపేట్‌లో చదరపు గజం జాగా రేటును హెచ్ఎండీఏ రూ.1.10 లక్షలుగా నిర్ధారించింది. దాని ప్రకారం ఎకరా భూమి ధర రూ.53.24 కోట్లు. ఆ లెక్కన బీఆర్ఎస్‌కు హెచ్​ఎండీఏ ఇచ్చిన భూమి విలువ రూ.585.64 కోట్లు. కానీ ఆ విలువలో బీఆర్ఎస్ పార్టీ భూమి కోసం కట్టాల్సిన డబ్బు కేవలం 6.4 శాతమే కావడం గమనార్హం. తాజా వేలం తర్వాత ఆ ప్రాంతంలోని భూమి విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. కనీసం ఎకరా భూమి ధర రూ.60 కోట్ల నుంచి రూ.65 కోట్ల దాకా పలికే అవకాశముందని తెలుస్తున్నది. గతంలో కోకాపేట్​లో అత్యధికంగా రూ.50 కోట్లు, ఖానామెట్‌లో రూ.60 కోట్ల వరకు ధర పలికింది. ఈ లెక్కన కోకాపేట్​లో మరింత ధర పలికే అవకాశముందని చెప్తున్నారు.